స్వామినాథన్ సిఫారసుల అమలుతోనే రైతులకు మేలు

విధాత: స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలుతోనే రైతాంగానికి మేలు జరుగుతుందని, ఇందుకు రైతు పోరాటాలు ఉధృతం చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాల‌ని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ పిలుపునిచ్చారు. నల్లగొండలో రైతు సంఘం రాష్ట్ర 2వ మహాసభలు ముగింపు సందర్భంగా ఆయన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు రానున్న రోజుల్లో రైతుల కోసం ఏ విధంగా పోరాటం చేయాలనే విషయం గురించి మహాసభలో చర్చించి తీర్మానాలు చేశామన్నారు. అఖిల భారత […]

  • Publish Date - November 29, 2022 / 11:19 AM IST

విధాత: స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలుతోనే రైతాంగానికి మేలు జరుగుతుందని, ఇందుకు రైతు పోరాటాలు ఉధృతం చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాల‌ని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ పిలుపునిచ్చారు. నల్లగొండలో రైతు సంఘం రాష్ట్ర 2వ మహాసభలు ముగింపు సందర్భంగా ఆయన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు

రానున్న రోజుల్లో రైతుల కోసం ఏ విధంగా పోరాటం చేయాలనే విషయం గురించి మహాసభలో చర్చించి తీర్మానాలు చేశామన్నారు. అఖిల భారత కిసాన్ 35వ మహాసభలు డిసెంబర్‌లో కేరళలో జరుగుతాయని తెలిపారు. స్వామి నాథన్ కమిషన్‌ను అమలు పరిచి రైతులకు అన్ని రకాల సబ్సీడీ వర్తింప జేయాలని రైతు సంఘం డిమాండ్ చేస్తుంద‌న్నారు.

కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక 4నల్ల చట్టాలను తీసుకొచ్చిందని విమ‌ర్శించారు. ఇప్పటికే ఉపాధి లేక దినసరి కూలీలు వేలమంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నిత్యావసర సరుకుల రేట్లు పెరిగాయని, రైతుల, కార్మికుల హక్కులను నరేంద్ర మోడీ హరింప జేస్తున్నారని ఆరోపించారు.

దేశ వ్యాప్తంగా సంవత్సరానికి 15వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. తెలంగాణలో 7వందల మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రైతులు కష్టపడి పంటలు పండించి నప్పటికీ సరైన గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములకు చెందిన రైతులకు పట్టాలు ఇస్తానని మాట ఇచ్చి తప్పిందని ఆరోపించారు. రుణమాఫీ ఏకకాలంలో చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని హెచ్చ‌రించారు.