న్యూఢిల్లీ : సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న వారికి యూపీఎస్సీ శుభవార్త చెప్పింది. అఖిల భారత సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 పరీక్షకు యూపీఎస్సీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన క్యాలెండర్కు అనుగుణంగానే ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నేటి నుంచి మార్చి 5వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించనున్నారు. దీంతో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో 150 పోస్టులకు విడిగా యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు, దరఖాస్తు ఫీజుల వివరాలు..
సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 32 ఏండ్ల మధ్య ఉండాలి. ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ఆధారంగా మినహాయింపు ఉంది. దరఖాస్తులకు ఓబీసీ, ఇతర అభ్యర్థులు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు.
పరీక్ష విధానం..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష మూడంచెల్లో ఉంటుంది. మొదట ప్రిలిమినరీ పరీక్షను అబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రిలిమినరీలో నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ రాసేందుకు అనుమతిస్తారు. మెయిన్స్ పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తుల కోసం <upsconline.nic.in>(https://upsconline.nic.in/upsc/OTRP/) ఈ లింక్ను క్లిక్ చేయండి.