Civil Services | సివిల్‌ సర్వీస్‌ వ్యవస్థపై మోదీ సర్కార్‌ దాడి

82 మంది మాజీ బ్యూరోక్రాట్ల ఆవేదన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బహిరంగ లేఖ విధాత : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి ఆలిండియా సర్వీసుల (Civil Services) వ్యవస్థను ఒక పద్ధతి ప్రకారం నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని 82 మంది మాజీ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కాన్‌స్టిట్యూషనల్‌ కండక్ట్‌ గ్రూప్‌గా తమను తాము పేర్కొన్న మాజీ అధికారులు.. విధి నిర్వహణలో ఉన్న సమయంలో స్వతంత్రంగా, నిష్పాక్షికంగా, ఎలాంటి రాజకీయ సిద్ధాంతాలను అనుసరించకుండా ఉండాలనేది […]

  • Publish Date - May 26, 2023 / 01:44 PM IST

  • 82 మంది మాజీ బ్యూరోక్రాట్ల ఆవేదన
  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బహిరంగ లేఖ

విధాత : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి ఆలిండియా సర్వీసుల (Civil Services) వ్యవస్థను ఒక పద్ధతి ప్రకారం నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని 82 మంది మాజీ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

కాన్‌స్టిట్యూషనల్‌ కండక్ట్‌ గ్రూప్‌గా తమను తాము పేర్కొన్న మాజీ అధికారులు.. విధి నిర్వహణలో ఉన్న సమయంలో స్వతంత్రంగా, నిష్పాక్షికంగా, ఎలాంటి రాజకీయ సిద్ధాంతాలను అనుసరించకుండా ఉండాలనేది చారిత్రక అవగాహనని, దానికి విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదన్న భయాలను వారు వ్యక్తం చేశారు.

ఐఏఎస్‌ వ్యవస్థకు పితామహుడిగా భావించే సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ రూపొందించిన సూత్రాలను ఇవి సమూలంగా మార్చివేస్తాయని మాజీ ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యంగానికి కాకుండా అధికార పార్టీకి విధేయంగా ఉండే వందిమాగధులతో నింపేస్తారన్న ఆందోళనను వెలిబుచ్చారు.

ఐఏఎస్‌, ఐపీఎస్‌ల అద్వితీయ సమాఖ్య స్వరూపానికి చేటు కలిగించేలా ఉన్న పలు చర్యలను వారు ప్రస్తావించారు. కాగా.. కేటాయించిన రాష్ట్ర క్యాడర్‌కు కాకుండా కేంద్ర ప్రభుత్వం పట్ల విధేయతతో ఉండాలని ఒత్తిడి చేసే చర్యలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని తెలిపారు.

మధ్యస్థాయి రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో అస్పష్టత ఉంటున్నదని, సైద్ధాంతిక అంచనాల ఆధారంగా నియామకాలు ఉంటున్నాయని తెలిపారు. అత్యున్నత స్థానాల్లో ఉన్న కొందరు సీనియర్‌ అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు సైతం సివిల్‌ సర్వీసుల భవిష్యత్తుపై ఆందోళన రేకెత్తిస్తున్నాయని పేర్కొన్నారు.

Latest News