Odisha Young Farmer | ఇటీవలి కాలంలో చాలా మంది యువత.. వ్యవసాయం వైపు అడుగులేస్తున్నారు. వినూత్నంగా వ్యవసాయం చేస్తూ.. మంచి దిగుబడి సాధిస్తున్నారు. లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. ఒడిశా( Odisha )కు చెందిన ఓ యువ రైతు(Odisha Young Farmer ) కూడా చేపల పెంపకం( Fish Pond )తో పాటు కూరగాయలు( Vegetables ) పండిస్తూ ఏడాదికి లక్షలు సంపాదిస్తున్నాడు. చేపల చెరువుపైనే సొరకాయలను( Bottle Gourds ) పండిస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నాడు.
ఒడిశాలోని సుందర్ఘర్ జిల్లా తంగేర్పల్లి బ్లాక్ పరిధిలోని రత్నాపూర్ గ్రామానికి చెందిన హిరోద్ పటేల్ ఇంటర్ తర్వాత ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో చేరి ఎలక్ట్రిషీయన్ కోర్సు పూర్తి చేశాడు. కానీ ఉద్యోగం చేయడంం ఇష్టం లేదు. దీంతో తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలనుకున్నాడు. ఈ క్రమంలో హిరోద్ పొలం బాట పట్టాడు.
వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు
కొన్నాళ్లు తండ్రిని అనుసరిస్తూ వరి సాగులో నిమగ్నమయ్యాడు. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు పండించాలనుకున్నాడు. ఎకరం భూమిలో కూరగాయలు సాగు చేశాడు. ఇక అరటి తోట పెట్టాలని సంకల్పించిన హిరోద్.. మహారాష్ట్రలోని జల్గావ్ వెళ్లి ఆ సాగులో శిక్షణ పొందాడు. ఆ తర్వాత ఫిషికల్చర్లో కూడా నైపుణ్యం సంపాదించాడు.
వెదురు కర్రలతో పందిరి
2019లో తన పొలంలో నాలుగు చెరువులను తవ్వాడు. ఆ చెరువుల్లో చేపల పెంపకం ప్రారంభించాడు. ప్రస్తుతం కూడా చేపలను పెంచుతున్నాడు. అయితే ప్రస్తుతం మూడు చెరువులు అందుబాటులో ఉండగా.. ఆ చెరువులపై ఏదైనా చేయొచ్చా..? అని వినూత్నంగా ఆలోచించాడు. దీంతో సొరకాయల సాగుకు వీలుంటుందని గ్రహించిన హిరోద్.. వెదురు కర్రలతో పందిరి వేశాడు. ఆ తర్వాత సొరకాయల సాగు ప్రారంభించాడు. ఇక ఏడాదికి 1200 కిలోల సొరకాయలను పండిస్తున్నాడు.
ఏడాదికి రూ. 8 లక్షలు సంపాదిస్తున్న యువ రైతు
మరోవైపు అరటి సాగుతో పాటు బంతిపూలు, కూరగాయలు పండిస్తున్నాడు. చేపల పెంపకం, సొరకాయల సాగు, ఇతర కూరగాయలు పండిస్తూ ఏడాదికి రూ. 8 లక్షలు సంపాదిస్తున్నాడు యువ రైతు. చేపల పెంపకం ద్వారా ఏడాదికి రూ. లక్ష, బంతిపూల సాగుతో రూ. 60 వేలు(రెండు సీజన్లలో రూ. 1.2 లక్షలు), అరటి, సొరకాయ, గుమ్మడి కాయలు, ఇతర కూరగాయల ద్వారా రూ. 6 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నాడు హిరోద్.
యువ ప్రగతిశీల రైతు అవార్డు
వ్యవసాయంలో వినూత్న పద్ధతులు అవలంభిస్తూ.. రకరకాల పంటలు పండిస్తున్న యువ రైతు హిరోద్కు ఒడిశా ప్రభుత్వం యువ ప్రగతిశీల రైతు అవార్డుతో మూడేళ్ల క్రితం సత్కరించింది. ఇతని వ్యవసాయ పద్ధతులను పలువురు రైతులు అవలంభించి లాభాలు గడిస్తున్నాడు. అగ్రికల్చర్ విద్యార్థులకు కూడా నైపుణ్యాన్ని అందిస్తున్నాడు.
