Veerendra Sehwag: డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి క్రికెట్ ప్రేమికులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వన్డే అయిన టెస్ట్ అయిన ఒకే శైలి బ్యాటింగ్ చేస్తూ బౌలర్స్ గుండెల్లో వణుకు పుట్టిస్తుంటాడు సెహ్వాగ్. టెస్ట్ లో ట్రిపుల్ సెంచరీలు కొట్టిన ఘనత సెహ్వాగ్దే. 2015 లో క్రికెట్ నుంచి రిటైర్ అయిన సెహ్వాగ్ ప్రస్తుతం కామెంటేటర్ గా, విశ్లేషకుడిగా అలరిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోను విచిత్రమైన ట్వీట్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు. సెహ్వాగ్ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారానో లేదంటే ఇంటర్వ్యూలలోనో అనేక ఆసక్తికర విషయాలు తెలియజేస్తూ హాట్ టాపిక్ అవుతుంటారు.
2003లో టీమిండియా టీం హెడ్ కోచ్గా జాన్ రైట్ ఉండేవారు. ఆ ఏడాది అండర్ డాగ్స్గా వరల్డ్ కప్లోకి అడుగుపెట్టిన భారత్ ఫైనల్కి వెళ్లింది. అప్పుడు జాన్ రైట్, సెహ్వాగ్ మధ్య ఆసక్తికర సంఘటన జరిగిందట. ఆ విషయాన్ని సెహ్వాగ్ తెలియజేస్తూ.. కెరియర్ మొదట్లో నేను భారీ షాట్స్ ఆడుతూ ఉండేవాడిని. శ్రీలంకతో ఆడినప్పుడు మా టార్గెట్ 203 పరుగులు. అప్పుడు కోచ్ నాదగ్గరకు వచ్చి నువ్వు 40 ఓవర్లు బాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేసిన ఓకే కాని, అవుట్ కావొద్దు. నీలాంటి బ్యాట్స్మెన్ ఔట్ కావొద్దు అని అన్నారు. అప్పుడు నాకు ఇంగ్లీష్ పెద్దగా రాకపోవడం వలన ఆయన చెప్పింది అర్ధం కాలేదు. ఇక నేను బ్యాటింగ్ కి వెళ్లి ఎప్పటి మాదిరిగానే భారీ షాట్స్ ఆడి 10 -12 రన్స్ చేసి అవుట్ అయ్యాను.
ఇక ఔటైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కి రాగానే కోచ్ నా కాలర్ పట్టుకొని కుర్చిలోకి విసిరేసాడు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. రాజీవ్ శుక్ల దగ్గరకు వెళ్లి అసలు విషయం చెప్పాను. మనకు ఇండిపెండెన్స్ వచ్చాక కూడా తెల్లోళ్ళు మన మీద పెత్తనం చెలాయిస్తున్నారు అని చాలా కోపంగా అన్నాను. అయితే అనంతరం టీం మీటింగ్ లో సచిన్.. సెహ్వాగ్ కి జాన్ రైట్ కి మధ్య జరిగిన విషయం టీం లోనే ఉండాలి అని చెప్పాడు అని సెహ్వాగ్ తెలియజేశారు. అయితే ఆయన ప్రవర్తించడానికి గల కారణం తర్వాత అర్ధమైంది. ఆయన వల్లనే నేను క్రికెట్లో ఎక్కువ కాలం కొనసాగాను అని వీరేంద్రుడు తెలియజేశారు. ఈ విషయాన్ని టీం ఇండియా మాజీ టీం మేనేజర్ అమిత్ మాథుర్ రాసిన “పిచ్ లైఫ్ : మై లైఫ్ ఇండియన్ క్రికెట్ ” అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సెహ్వాగ్ తెలియజేశారు.