Lok Sabha Elections | న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఐదు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రెండు దశల ఎన్నికలు మిగిలి ఉన్నాయి. ఆరో దశ ఎన్నికలు మే 25న జరగనున్నాయి. ఈ దశలో 57 స్థానాలకు గానూ 866 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
అయితే 866 మందిలో 39 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. అంటే 338 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఈ కోటీశ్వరుల మధ్య ఓ అత్యంత నిరుపేద కూడా పోటీ చేస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈ నాయకుడే అత్యంత నిరుపేద అని చెప్పొచ్చు. ఎందుకంటే అతని ఆస్తి కేవలం రూ. 2 మాత్రమే.
ఇక 338 కోటీశ్వరుల్లో అత్యంత ధనికుడు బీజేపీ అభ్యర్థి నవీన్ జిందాల్. కురుక్షేత్ర నుంచి పోటీ చేస్తున్న నవీన్ జిందాల్ ఆస్తులు రూ. 1,241 కోట్లు. బీజేడీ నేత సంతృప్త్ మిశ్రా రూ. 482 కోట్లు, ఆప్ నేత సుశీల్ గుప్తా రూ. 169 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నాడు. ఇక ప్రధాన పార్టీల పరంగా చూసుకుంటే బీజేడీ నుంచి ఆరుగురు, బీజేపీ నుంచి 48, ఎస్పీ 11, కాంగ్రెస్ 20, టీఎంసీ ఏడుగురు, ఆర్జేడీ, జేడీయూ, ఆప్ల నుంచి నలుగురు చొప్పున రూ. కోటికి పైగా ఆస్తులను కలిగి ఉన్నారు.
ఆరో దశ ఎన్నికల్లో అత్యంత నిరుపేదగా మాస్టర్ రణధీర్ సింగ్ నిలిచాడు. రోహతక్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రణధీర్ ఆస్తి కేవలం రూ. 2 మాత్రమే. ప్రతాప్గర్హ్ నుంచి పోటీ చేస్తున్న రామ్ యాదవ్ ఆస్తి రూ. 1,686. ఈయన ఎస్యూసీఐ(సీ) పార్టీ తరపున బరిలో ఉన్నారు.