Odisha Assembly Results | భువనేశ్వర్ : ఒడిశాలో బీజూ జనతా దళ్ పార్టీకి భారతీయ జనతా పార్టీ జలక్ ఇచ్చింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు ఎవరూ ఊహించని విధంగా వెలువడుతున్నాయి. 147 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఒడిశాలో.. ప్రస్తుతం బీజేపీ 74 స్థానాల్లో లీడింగ్లో ఉంది. బీజేడీ 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 13, ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
ఇక రాష్ట్ర సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ సైతం వెనుకంజలో ఉన్నారు. కాంటాబంజిలో నవీన్ పట్నాయక్ 1,158 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఆయన పోటీ చేసిన రెండో స్థానం హింజిలిలో మాత్రం స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
బీజూ జనతాదళ్ ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నది. సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఆ ధీమా వ్యక్తం చేశారు. కానీ ఈసారి ఒడిశాపై కన్నేసిన బీజేపీ.. నవీన్ దూకుడుకు బ్రేక్ వేసింది. పట్నాయక్ ప్రభుత్వ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒడిశాలో పనిచేశాయి.