విధాత: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికరంగా స్పందించారు. కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి కోసం కొత్త వ్యూహాలను రూపొందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. బీహార్ ఎన్నికలలో ప్రజల తీర్పు కాంగ్రెస్ పార్టీకి, దాని మిత్రపక్షాలకు ఓ”పాఠం”గా అభివర్ణించారు. శివకుమార్ పిటిఐతో మాట్లాడారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయానికి మహిళలకు రూ. 10,000 ఆర్థిక సహాయం పథకం దోహదం చేసిందా అన్న ప్రశ్నకు..ఇండియా కూటమి ఓటమి, ఎన్డీఏ విజయంపై నాకు ఇంకా వివరణాత్మక నివేదిక రాలేదన్నారు. నివేదిక వచ్చిన తర్వాత నేను తిరిగి మాట్లాడుతానని తెలిపారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కు పరిమితం కావడం..ఇండియా కూటమి ఓటమి పాలవ్వడంతో కాంగ్రెస్ అగ్రనాయకత్వంపైన, ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వ సమర్థతపైన మరోసారి పార్టీలో అసంతృప్తి రగిలే పరిస్థితి కనిపిస్తుంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో వరుస ఓటములు ఆ పార్టీని దేశ వ్యాప్తంగా మరింత బలహీన పరుస్తున్నాయన్న ఆందోళన పార్టీ నాయకత్వంలో వ్యక్తమవుతుంది.
