ప్రజల ప్రయోజనాలకు ద్రోహం చేయలేం.. మావోయిస్టుల మరో సంచలన లేఖ

మారిన సామాజిక పరిస్థితికి తగినట్టుగా వెనకంజలోని విప్లవోద్యమాన్ని పురోగమింపచేయడానికి వర్గపోరాటాన్ని - ప్రజాయుద్ధాన్ని కొనసాగించడమే మా కర్తవ్యం. సెప్టెంబర్ 17 నుండి ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో మా పార్టీ పొలిట్ బ్యూరో (పీవీ) సభ్యుడు కామ్రేడ్ సోను, అభయ్ పేరుతో విడుదల చేసిన పత్రికా ప్రకటన, దాని ఆడియో ఫైల్, విప్లవ ప్రజలకు విజ్ఞప్తి అనే ప్రకటనలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి

  • Publish Date - September 23, 2025 / 12:40 PM IST

శత్రువుకు ఆయుధాలు అప్పగించడం మా విధానం కాదు!

పరిస్థితులు సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టమని సూచించడం లేదు

సోను ప్రకటన వాస్తవాల వక్రీకరణ

 పార్టీని చీల్చే దుష్ట పథకం

జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నాడు

దీర్ఘకాలిక ప్రజా యుద్ధ పంథా

ఆయుధాలు వదిలిపెట్టడం అంటే సరెండర్

సోను ప్రకటనపై కేంద్ర కమిటీ తీవ్ర ఆగ్రహం

శాంతి చర్చలకు పార్టీ సిద్ధం

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)
కేంద్ర కమిటీ

 

శత్రువుకు ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల ప్రయోజనాలకు ద్రోహం చేయడం మా విధానం కాదని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట విడుదలైన సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశారు. ఇటీవల పార్టీ పొలిటి బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను అభయ్ పేరుతో సాయుధ పోరాట విరమణ కు సిద్ధమని చేసిన ప్రకటన, ఆడియో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన సోను వ్యక్తిగత నిర్ణయమని పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ ప్రకటనను మా కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పూర్తిగా తిరస్కరిస్తున్నాయి, ఖండిస్తున్నాయని తేల్చిచెప్పారు. ఇప్పటికే సోను ప్రకటనను తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఖండించిన విషయం తెలిసిందే. తాజాగా సోను ప్రకటనను పార్టీ కేంద్ర కమిటీ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ తీవ్రంగా ఖండించాయి. సోను వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పార్టీని చీల్చే దుష్ట పథకంగా అభివర్ణించారు. ఈ నెల 20వ తేదీన విడుదలైన ప్రకటన పూర్తి పాఠం ఇలా ఉంది.

విధాత ప్రత్యేక ప్రతినిధి: మారిన సామాజిక పరిస్థితికి తగినట్టుగా వెనకంజలోని విప్లవోద్యమాన్ని పురోగమింపచేయడానికి వర్గపోరాటాన్ని – ప్రజాయుద్ధాన్ని కొనసాగించడమే మా కర్తవ్యం. సెప్టెంబర్ 17 నుండి ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో మా పార్టీ పొలిట్ బ్యూరో (పీవీ) సభ్యుడు కామ్రేడ్ సోను, అభయ్ పేరుతో విడుదల చేసిన పత్రికా ప్రకటన, దాని ఆడియో ఫైల్, విప్లవ ప్రజలకు విజ్ఞప్తి అనే ప్రకటనలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ‘మారిన అంతర్జాతీయ, దేశీయ పరిస్థితుల రీత్యా, దేశ ప్రధానమంత్రి, హోంమంత్రి నుండి మొదలుకుని పోలీసు ఉన్నతాధికారుల వరకు, ఆయుధాల్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని చేస్తున్న విజ్ఞప్తుల రీత్యా మేము ఆయుధాలు వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకున్నాం’ అని ఆయన ఇందులో ప్రకటించాడు. ఇది మా పార్టీ ప్రధాన కార్యదర్శి అమరుడు కామ్రేడ్ బసవరాజు శాంతిచర్చల కోసం చేసిన ప్రయత్నంలో భాగమని కూడా ఆయన చెప్పాడు. కామ్రేడ్ సోను చేసిన ఈ ప్రకటన ఆయన వ్యక్తిగత నిర్ణయమే. ఆయన చేసిన ఈ ప్రకటనను మా కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పూర్తిగా తిరస్కరిస్తున్నాయి, ఖండిస్తున్నాయి.

– పరిస్థితులు సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టమని సూచించడం లేదు

మారిన అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులు సాయుధ పోరాటాన్ని వదిలి పెట్టాలని సూచించడం లేదు. దీనికి భిన్నంగా సాయుధ పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతున్నాయి. వెనకబడిన దేశాల పీడిత జాతులపై, ప్రజలపై సామ్రాజ్యవాద దోపిడి, పీడనలు మరింత తీవ్రతరమవుతున్నాయి. పెట్టుబడిదారీ – సామ్రాజ్యవాద దేశాల్లో పెట్టుబడిదారీ వర్గం అక్కడి కార్మికవర్గంపై, మధ్యతరగతి ప్రజానీకంపై ‘పొదుపు చర్యల’ పేరుతో దోపిడి, పీడనల్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. అక్కడి దోపిడీ వర్గాలు ఫాసిజాన్ని, రేసిజాన్ని అమలు చేస్తున్నాయి. ఇవన్ని రోజురోజుకు తీవ్రతరమవుతున్న సామ్రాజ్యవాద ఆర్థిక, రాజకీయ సంక్షోభ ఫలితమే. మనదేశంలో సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదార్లకు చెందిన విదేశీ, స్వదేశీ బడా కార్పొరేట్లు వ్యవసాయిక, పారిశ్రామిక, సేవారంగాలతో పాటు సామాజిక జీవితానికి చెందిన సకల రంగాల్లో దోపిడి, పీడనల్ని రోజురోజుకు తీవ్రతరం చేస్తున్నాయి. దీంతో పట్టణ, మైదాన, అటవీ ప్రాంతాల్లో విశాల ప్రజానీకం (పీడిత వర్గాలు, పీడిత సామాజిక సముదాయాలు, పీడిత జాతులు) సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాల కూటమికి వ్యతిరేకంగా వర్గపోరాటాన్ని మరింత విస్తృతం – తీవ్రతరం చేయాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతోంది. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ – బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోని విశాల ప్రజానీకంపై సామాజిక జీవితానికి చెందిన అన్ని రంగాల్లో చేస్తున్న ఫాసిస్టు దాడులను ప్రతిఘటించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా, మనదేశంలో ఆర్థిక, సామాజిక అంతరాలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. మనదేశంలో కానీ, ప్రపంచంలో గానీ ప్రజల దైనందిన సమస్యలు గానీ, మౌలిక సమస్యలు గానీ పరిష్కారం కాలేదు. ఈ స్థితిలో మన దేశంలో గానీ, ప్రపంచంలో గానీ నేటి పరిస్థితులు చట్టబద్ద-చట్టవ్యతిరేక, రహస్య-బహిరంగ పోరాట, నిర్మాణ రూపాలను సమన్వయించుకుంటూనే సాయుధ పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతున్నాయి.

– సోను ప్రకటన వాస్తవాల వక్రీకరణ

మా పార్టీ ప్రధాన కార్యదర్శి అమరుడు కామ్రేడ్ బసవరాజు (బీఆర్) శాంతిచర్చల కోసం చేసిన ప్రయత్నంలో భాగమే ఆయుధాల విరమణ అని కామ్రేడ్ సోను ప్రకటించడం వాస్తవాల వక్రీకరణ. అమరుడు కామ్రేడ్ బసవరాజు మే 7 నాటి ప్రకటనలో ఆయుధాల్ని వదిలి పెట్టడం గురించి మా కోర్ గ్రూపుతో చర్చిస్తామని ప్రకటన చేసినప్పటికీ త్వరలోనే అందులోని లోపాన్ని గుర్తించడంతో పాటు, మా పార్టీ చేసిన శాంతిచర్చల ప్రస్తావనను నిర్లక్యం చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ యుద్ధాన్ని కొనసాగిస్తుండడంతో, దాన్ని ఉపసంహరించుకుని ‘కగార్’ యుద్ధాన్ని
ప్రతిఘటించాలని యావత్తు పార్టీకి, పీ.ఎల్.జీ.ఏ.కు, విప్లవ శిబిరానికి ఆయన పిలుపునిచ్చాడు. ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వంలోనే నేడు దేశవ్యాప్తంగా పార్టీ, పీ.ఎల్.జీ.ఏ., విప్లవ శిబిరం ‘కగార్’ యుద్ధాన్ని చట్టబద్ద – చట్టవ్యతిరేక రూపాల్లో శక్తిమేరకు ప్రతిఘటిస్తున్నాయి.

– పార్టీని చీల్చే దుష్ట పథకం

ఈ వాస్తవాన్ని ఉద్దేశ్యపూర్వకంగా కామ్రేడ్ సోను వక్రీకరించాడు. ఈ దురుద్దేశ్యపూర్వ వక్రీకరణ కుటిలమైనది, ఖండించతగినది. ‘ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసే విషయంపై పార్టీ సభ్యుల, వివిధ స్థాయిల పార్టీ కమిటీల అభిప్రాయాలను సేకరించడం, జైల్లో బందీలుగా ఉన్న మా పార్టీ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను సేకరించడం, విప్లవాభిమానుల, ప్రజాస్వామిక, ప్రగతిశీల, వామపక శక్తుల, సంస్థల అభిప్రాయాలను సేకరించడం అనేది మా పార్టీని చీలదీసే దుష్టపథకమే. ఈ దుష్ట పథకాన్ని విరమించుకోవాల్సిందిగా కామ్రేడ్ సోనును కోరుతున్నాం. ఈ దుష్ట పథకాన్ని తిప్పికొట్టాల్సిందిగా ప్రజాసంఘాలకు, పార్టీ సభ్యులకు, వివిధ స్థాయిల పార్టీ కమిటీలకు, జైల్లో బందీలుగా ఉన్న పార్టీ నాయకులకు, పార్టీ సభ్యులకు, విప్లవాభిమానులకు, ప్రజాస్వామిక, ప్రగతిశీల, వామపక్ష శక్తులకు, సంస్థలకు పిలుపునిస్తున్నాం.

– జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నాడు

భారత విప్లవోద్యమం ఓటమి పాలయిందని చెపుతూ, దీనికి కారణం పార్టీ అనుసరించిన అతివాద ఒంటెత్తుపోకడతో కూడిన తప్పిదాలని కామ్రేడ్ సోను ‘విప్లవ ప్రజలకు విజ్ఞప్తి’ అనే ప్రకటనలో పేర్కొన్నాడు. పార్టీ అతివాద ఎత్తుగడలను ఆచరించిందని తను అనుకుంటే పార్టీలో ఉంటూ వాటిని సరిదిద్దడానికి కృషి చేయడం పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన బాధ్యత. కానీ ఆయన ఈ విప్లవకర పద్ధతికి తిలోదకలిచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నాడు. “ఇప్పటికైనా, దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథా అంటూ, సాయుధ పోరాటం అంటూ, పరిస్థితులలోని మార్పులతో, స్థలకాలాలతో నిమిత్తం లేకుండా, చైనా పంథా, రష్యా పంథా అనే పిడివాద ఆచరణకు స్వస్తి చెప్పి భారతదేశ స్థలకాల పరిస్థితులకు తగిన పంథాలో భారత విప్లవాన్ని జయప్రదం చేయడానికి పూనుకోవడమే పార్టీ ముందు మిగిలిన ఏకైక కర్తవ్యం” అని ‘విప్లవ ప్రజలకు విజ్ఞప్తి’ ప్రకటనలో పేర్కొన్నారు. అనుసరిస్తున్న మార్గం పిడివాదమయితే తను ప్రత్యమ్నాయ మార్గాన్ని రూపొందించి పార్టీలో రెండు పంథాల మధ్య పోరాటాన్ని చేపట్టేందుకు ఆయన సిద్ధంగా లేడు. సాయుధ పోరాటాన్ని తిరస్కరిస్తూ తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అని ప్రకటించడం కేడర్లను, ప్రజలను మోసగించడమే అవుతుంది.

– దీర్ఘకాలిక ప్రజా యుద్ధ పంథా

మార్క్సిజం-లెనినిజం-మావోయిజం సిద్ధాంతం ప్రకారం విప్లవపు కేంద్ర కర్తవ్యం రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడం. అందుకోసం సాయుధ శక్తితో, సాయుధ పోరాటం చేస్తాం. దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాలోనయినా, సార్వత్రిక తిరుగుబాటు పంథాలోనయినా సాయుధ శక్తి ద్వారానే దోపిడీ వర్గాలను అధికారం నుండి కూలదోసి పీడిత వర్గాలు అధికారాన్ని హస్తగతం చేసుకుంటాయి. మనదేశం అర్ధవలస, అర్ధభూస్వామ్య దేశం కాబట్టి ప్రాంతాల వారీగా అధికారాన్ని హస్తగతం చేసుకునే దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాను మా పార్టీ ఆచరిస్తోంది. కాబట్టి ఆయుధాలు వదిలి శాంతిచర్చలకు వెళ్లాలని నిర్ణయించడం మార్క్సిజం-లెనినిజం-మావోయిజం సిద్ధాంతానికి, మా రాజకీయ-మిలిటరీ పంథాకు వ్యతిరేకమైనది.

– ఆయుధాలు వదిలిపెట్టడం అంటే సరెండర్

ఆయుధాలు వదిలిపెట్టడం అంటే వాటిని శత్రువుకు అప్పగించడమని, శత్రువుకు లొంగిపోవడం (సరెండర్) అని అర్థం. శత్రువుకు ఆయుధాల్ని అప్పగించి, లొంగిపోయి తాత్కాలిక సాయుధ పోరాట విరమణ పేరుతో సాయుధ పోరాటాన్ని విరమించడం అంటే విప్లవ పార్టీ రివిజనిస్టు పార్టీగా మారిపోవడమే అవుతుంది. ఆయుధాల్ని శత్రువుకు అప్పగించి లొంగిపోవడం అంటే అమరులకు, దేశంలోని విశాల ప్రజలకు (పీడిత వర్గాలు, పీడిత సాంఘిక సముదాయాలు, పీడిత జాతులు) ద్రోహం చేయడమే. ఇది ప్రచండ తరహా ఆధునిక రివిజనిజం, విప్లవ ద్రోహం. అందుకే, ఆయుధాల్ని శత్రువుకు అప్పగించి, శత్రువుకు లొంగిపోవడానికి సిద్ధపడుతున్న సోను విప్లవ ద్రోహాన్ని పార్టీ సభ్యులు, అన్నిస్థాయిల పార్టీ కమిటీలు, జైల్లోని పార్టీ సభ్యులు, పార్టీ నాయకులు, విప్లవాభిమానులు తీవ్రంగా ఖండించాల్సిందిగా కోరుతున్నాం. ఆయన, ఆయన అనుచరులు శత్రువుకు లొంగిపోదల్చుకుంటే లొంగిపోవచ్చు, కానీ పార్టీకి చెందిన ఆయుధాల్ని శత్రువుకు అప్పగించే అధికారం వీళ్లకు లేదు. అందుకే వాటిని పార్టీకి అప్పగించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ వాళ్లు సామరస్యపూర్వకంగా అప్పగించకపోతే వారినుండి ఆయుధాల్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా పీ.ఎల్.జీ.ఏ.ను నిర్దేశిస్తున్నాం. సాయుధ పోరాటాన్నే తిరస్కరిస్తున్న ఆయన తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అని ప్రకటించడం మోసకారితనమే అవుతుంది, ఆయన అనుసరించదలచుకున్న మార్గం పార్లమెంటరీ పంథానే అవుతుంది. అందుకే అది ప్రచండ తరహా నయారివిజనిజం అవుతుంది.

ఈ స్థితిలో ఆయనకు అభయ్ పేరుతో పత్రికా ప్రకటనలు ఇచ్చే అధికారం లేదని తెలియజేస్తున్నాం. మా పార్టీ మౌలిక పంథాకు, పాలసీలకు, తీర్మానాలకు కట్టుబడి రాజకీయ పరిణామాలపై పార్టీ వైఖరి తెలియజేస్తూ, ప్రజలకు పోరాట పిలుపుల్ని ఇవ్వడం మీడియా ప్రతినిధి అభయ్ బాధ్యత. దీనికి పూర్తి భిన్నమైన వైఖరిని చేపట్టిన ఆయనకు అభయ్ పేరుతో ప్రకటనలు ఇచ్చే అధికారం లేదు.
కేంద్రకమిటీ విడుదల చేస్తున్న ఈ ప్రకటనతో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకే ఎస్.జెడ్.సీ.) పూర్తిగా ఏకీభవిస్తోంది. ఈ పత్రికా ప్రకటనను దండకారణ్యంలోని అన్ని ప్రజా సంఘాలకు, ఇతర అన్ని స్థానిక నిర్మాణాల వద్దకు, ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజలను, ప్రజా నిర్మాణాలను విప్లవోద్యమంలో దృఢంగా నిలబెట్టే రాజకీయ, నిర్మాణ కృషి చేయాల్సిందిగా డీకేలోని పార్టీ సభ్యులందరికీ, అన్ని స్థాయిల పార్టీ కమిటీలకు, కమాండ్లకు పిలుపునిస్తున్నాం.

– శాంతి చర్చలకు సిద్ధం

ఇప్పటికీ మా పార్టీ శాంతిచర్చలకు సిద్ధమేనని తెలియజేస్తున్నాం. శాంతిచర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించేలా వాటిపై ఒత్తిడి తేవడానికి దేశవ్యాప్త ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిందిగా పౌరసమాజానికి, యావత్తు ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. విప్లవ ప్రతిఘాతక కగార్ యుద్ధంతో మన పార్టీ, పీ.ఎల్.జీ.ఏ., యావత్తు విప్లవోద్యమం తీవ్రంగా నష్టపోతున్న స్థితిలో శత్రుదాడికి వెరచి ఆయుధాల్ని శత్రువుకు అప్పగించి, శత్రువుకు లొంగిపోవడం అంటే అమరులకు, ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుంది. ఆ ద్రోహాన్ని తిరస్కరించి మారిన సామాజిక పరిస్థితులకు తగినట్టుగా, వెనకంజలో వున్న విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తోడ్పడేలా వర్గపోరాటాన్ని-ప్రజాయుద్ధాన్ని కొనసాగించడమే మన కర్తవ్యం. విప్లవోద్యమంలో వెనకంజలు, ఓటములు తాత్కాలికమే. అంతిమ విజయం ప్రజలదే. ఈ భూమ్మీద మనిషిని మరో మనిషి దోచుకోవడానికి అవకాశంలేని సమాజం కోసం వేల ఏండ్లుగా వర్గపోరాటం సాగుతూనే ఉంది. ఈ వర్గపోరాట మహాప్రస్థానం గెలుపు ఓటమి-అంతిమంగా గెలుపు అనే క్రమం గుండా సాగుతోంది. ఈ మహాప్రస్థానపు తుది విజయం భూమిపై సోషలిజం -కమ్యూనిజం స్థాపనే. అందుకోసం విప్లవోద్యమ వెనకంజలకు, ఓటములకు బెదరకుండా మనదేశంలో, ప్రపంచంలో సోషలిజం-కమ్యూనిజం స్థాపన కోసం మనవంతుగా వర్గపోరాటాన్ని – ప్రజాయుద్ధాన్ని కొనసాగించడమే మన కర్తవ్యం-మన మార్గం.

విప్లవాభినందనాలతో,
అభయ్
అధికార ప్రతినిధి,
కేంద్ర కమిటీ
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు).
వికల్ప్
అధికార ప్రతినిధి,
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

– ఎన్కౌంటర్లో వికల్ప్ మృతి

మావోయిస్టు పార్టీ ప్రతినిధులు ఈ సంయుక్త ప్రకటన ఈనెల 20వ తేదీన విడుదల చేశారు. 22వ తేదీ సోమవారం ఛత్తీస్గడ్ నారాయణపూర్ జిల్లా అబూజ్మాడ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందారు. వీరిలో కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోసా, కట్టా రామచంద్ర రెడ్డి అలియాస్ రాజు దాదా అలియాస్ వికల్ప్ ఉన్నారు. ప్రకటన విడుదల చేసిన వికల్ప్ కూడా తాజా ఎన్కౌంటర్లో మృతి చెందడం గమనార్హం. అయితే మావోయిస్టు పార్టీలో అధికార ప్రతినిధుల పేర్లు ఆ నాయకుడు మృతి చెందిన తర్వాత ఆ స్థానానికి వచ్చేవారు అదే పేరుతో ప్రకటనను విడుదల చేయడం పార్టీ సంప్రదాయంగా వస్తుంది. తాజా ప్రకటనలో అభయ్ పేరుతో మరో నేత ప్రకటన విడుదల చేయడం గమనార్హం. అంటే ఇంతకాలం అభయ్ పేరుతో ప్రకటనలు విడుదల చేస్తున్న సోను అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ ను ఆ స్థానం నుంచి తొలగించినట్లు చెప్పకనే చెప్పినట్లుగా భావించాల్సి వస్తోంది. అదేవిధంగా రేపు మరో నేత వికల్ప్ పేరుమీద ప్రకటనలు కొనసాగించవచ్చు.