విధాత : న్యూ ఇయర్ వేళ ధూమపాన ప్రియులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 1నుంచి పొగాకు ఉత్పత్తులపై నూతన జీఎస్టీ రేట్లు అమల్లోకి(Tobacco Products GST hike) రానున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు, సంబంధిత ఉత్పత్తులపై 40 శాతం, బీడీలపై 18 శాతం జీఎస్టీ విధించనున్నట్లు పేర్కొంది. ఈ పన్నుతో పాటు పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్ పెంపు, పొగాకుతో పాటు సంబంధిత ఉత్పత్తులకు ఎక్సైజ్ సుంకం వేసింది. పెరిగిన పన్నులు ఫిబ్రవరి 1నుంచి అమలవుతాయని కేంద్రం తెలిపింది.
పాన్ మసాలా తయారీపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధించేలా రెండు బిల్లులను పార్లమెంట్ డిసెంబర్లో ఆమోదించింది. ‘హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు-2025’ బిల్లును ఆమోదించిన సందర్భంగా పాన్మసాలా, సిగరెట్ల్లు, పొగాకు, ఇతర అనుబంధ ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ విధించనున్నట్లుగా..దీనికి సెస్ అదనం అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పొగాకు ఉత్పత్తులపై పెంచిన పన్నులతో వచ్చే ఆదాయాన్ని జాతీయ భద్రత బలోపేతానికి, ప్రజారోగ్యం కోసం ఖర్చు చేయనున్నట్లుగా కేంద్రం వెల్లడించింది.
