అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్, ఎస్పీ
యుపీలోని ఆజంగడ్ ఎన్నికల ప్రచార సభలో మోదీ
లక్నో: దేశంలో పౌరసత్వ సవరణ చట్టం ద్వారా పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ మొదలైందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. అయితే ఈ చట్టం గురించి అసత్యాలు ప్రచారం చేయడం ద్వారా దేశంలో అల్లర్లు సృష్టించడానికి కాంగ్రెస్, ఎస్పీ ప్రయత్నం చేసినట్లు ప్రధాని ఆరోపించారు. శరనార్థులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. యూపీలోని ఆజంగఢ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ.. కాంగ్రెస్, ఎస్పీలపై విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. మీరు (ప్రతిపక్షాలు) ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ప్రతి పౌరుడూ తెలుసుకున్నాడన్నారు. హిందువులు, ముస్లింల మధ్య కొట్లాటలు పెట్టి సెక్యులరిజం ముసుగు వేసుకున్నారని ఆరోపించారు. మీ (కాంగ్రెస్) లోపల దాగి ఉన్న పాపం బయటపడేది కాదు… ఇక్కడ ఉన్న మోదీ మీ (కాంగ్రెస్) ముసుగు తొలిగించారన్నారు. మీరు (విపక్షాలు) కుట్రదారులు, మతతత్వవాదులు. మీరు (కాంగ్రెస్) దేశాన్ని 7 దశాబ్దాల పాటు మతతత్వ పు మంటలు రగిలించారని మోదీ కాంగ్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు రెండు వేర్వేరు అయినా వారి దుఖానం ఒక్కటేనని అన్నారు. అక్కడ అసత్యాలు, బుజ్జగింపు రాజకీయాలు, అవినీతికి పాల్పడుతుంటారని ఆరోపించారు. విపక్షాలు ఈసారి బుజ్జగింపు రాజకీయాలను మూడింతలు పెంచాయని విమర్శించారు. యూపీలో బీజేపీ అధికారం చేపట్టాక ఎస్పీ హయాంలో కొనసాగినా గూండా రాజ్కు ముగింపు పలికినట్లు ప్రధాని చెప్పారు. అల్లరి మూకలు, మాఫియా కిడ్నాపర్లు, రౌడీ ముఠాలకు వ్యతిరేకంగా యోగి ప్రభుత్వం తాను అమలు చేసిన స్వచ్ఛ అభియాన్ను చేపట్టిందని కొనియాడారు. సెక్యులరిజం పేరుతో ప్రతిపక్షాలు చేస్తున్న బుజ్జగింపు రాజకీయాల ముసుగు తొలగించినట్టు ప్రధాని చెప్పారు.