Vande Bharat Sleeper Trains | ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు భారతీయ రైల్వేశాఖ మార్పులు చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలో రైల్వేశాఖ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి. ఆయా రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. దాంతో ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను మరికొన్ని మార్గాల్లో ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ భావిస్తున్నది. అయితే, ఈ రైళ్లలో కేవలం సీటింగ్ మాత్రమే ఉంటుంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణించడం ఇబ్బందికరంగా మారుతున్నది. ఈ క్రమంలో వందేభారత్ వర్షెన్లో స్లీపర్ రైళ్లను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే రైళ్ల తయారీ శరవేగంగా సాగుతున్నాయి.
త్వరలోనే తొలి రైలు పట్టాలు ఎక్కబోతున్నది. ఈ నెలలో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ట్రయల్ రన్ దిగ్విజయంగా పూర్తి చేసి ఆగస్టు 15 నుంచి వరకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నది. ప్రస్తుతం వివిధ మార్గాల్లో ప్రవేశపెట్టి.. 2029 నాటికి దేశవ్యాప్తంగా 250 మార్గాలను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయితే, ఏయే రూట్లలో ఈ రైళ్లు అందుబాటులోకి తీసుకురాబోతున్నారనే విషయం తెలియలేదు. సమాచారం మేరకు ఢిల్లీ – ముంబయి, ఢిల్లీ – కోల్కతా మార్గాల్లో ఈ రైళ్లను నడిపేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మార్గాల్లో రైళ్లకు ఫుల్ డిమాండ్ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో వందే భారత్ స్లీపర్ రైలును నడిపితే ప్రయాణికులకు ఎంతో ఊరట కలుగనున్నది.
రైల్వేశాఖ మొదటిసారిగా ఢిల్లీ – ముంబయి మార్గంలో వందే భారత్ స్లీపర్ రైళ్లను నడపనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, దీనిపై అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. రాబోయే రోజుల్లో రాజధాని ఎక్స్ప్రెస్ స్థానంలో ఈ రైళ్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇక వందే భారత్ స్లీపర్ రైళ్ల గరిష్ఠ వేగం 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉంది. ఈ రైలులో 16 కోచ్లు ఉండనున్నాయి. మొత్తం 823 బెర్తులు, వివిధ క్లాస్లు ఉంటాయి. వందే భారత్ స్లీపర్ రైలు రాకతో సుదూర ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఇందులో థర్డ్ ఏసీ 10 కోచ్లు, సెకండ్ ఏసీ నాలుగు కోచ్లు, ఒక కోచ్ ఫస్ట్ ఏసీ ఉంటుంది.
ఈ రైలులో రెండు ఎస్ఎల్ఆర్ కోచ్లుంటాయి. ప్రస్తుతానికి, రైలు ఛార్జీల వివరాలను తెలియరాలేదు. ఈ రైళ్లు ఫ్రంట్ ఫాసియా డిజైన్తో ఉంటాయి. కోచ్లో ఇంటర్ కమ్యూనికేషన్ గేట్స్, నాయిస్ ఇన్సులేషన్ ఉన్నాయి. దాంతో బయటి ధ్వని క్యాబిన్లోకి వినిపించదు. ఈ రైలులో దివ్యాంగుల కోసం ప్రత్యేక బెర్త్లు, ఆటోమేటిక్ తలుపులు ఉంటాయి. రైలు కోచ్లలో ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. రైలులో పుష్ బటన్ స్టాప్ను నొక్కడంతో అత్యవసర సమయంలో రైలు ఆగుతుంది. విమానాల్లో మాదిరిగా మాడ్యులర్ ఫిట్టింగ్లతో కూడిన బయో వ్యాక్యూమ్ టాయిలెట్ ఏర్పాటు చేశారు. ఏసీ ఫస్ట్ కార్లో హాట్ వాటర్ షవర్ సౌకర్యం ఉన్నది.