విధాత: మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ మళ్లీ పార్టీ మారాడు. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ(ఆర్ఎల్డీ) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు. ఆ వెంటనే దిలీప్ కుమార్ను రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ తెలంగాణ, మహారాష్ట్ర ఇంచార్జిగా నియమిస్తున్నట్లుగా పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి ప్రకటించారు. 2023 ఆక్టోబర్ 27న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్ష్లంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన దిలీప్ కుమార్ కు పార్టీలో తగిన గుర్తింపు దక్కకపోతుండటంతో రాజీనామా చేసినట్లుగా సమాచారం.
జంప్ జిలానీగా కపిలవాయి
దివంగత మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి వద్ధ, ఆయన మరణాంతరం ఉమామాధవరెడ్డి వద్ధ పీఎస్ గా పనిచేసిన దిలీప్ కుమార్ తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్ర మంత్రి కేసీఆర్ పీఎస్ గా పనిచేశారు. నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ తరుపున రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనమండలిల సభ్యుడిగా పని చేశాడు. 2009లో ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుండి విడిపోయిన తర్వాత వి. ప్రకాశ్, బెల్లయ్య నాయక్తో కలిసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 జూన్ 18న హైదరాబాద్లోని హరిహర కళాభవన్ కాళోజీ ప్రాంగణంలో తెలంగాణ విమోచన సమితి (టీవీఎస్)ని ఏర్పాటు చేశారు.
అనంతరం ఆయన విమలక్క, గద్దర్ లాంటి వారితో కలిసి టీయుఎఫ్ను ప్రారంభించి 2014 ఎన్నికల్లో అజిత్సింగ్ నేతృత్వంలోని టీఆర్ఎల్డీలో చేరాడు. తదనంతరం టీజేఎస్, బీజేపీలలో కూడా కపిలవాయి దిలీప్ కుమార్ పనిచేశారు. 2021ఫిబ్రవరి 21నుంచి 2023ఆక్టోబర్ 23వరకు బీజేపీలో పనిచేశారు. ఆ తర్వాతా కాంగ్రెస్ లో చేరారు. తాజాగా కాంగ్రెస్ కు రాజీనామా చేసి రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలో చేరారు. అయితే కపిలవాయి దిలీప్ కుమార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉనికిలో లేని ఆర్ ఎల్డీలో ఎందుకు చేరడన్న అంశం ఆసక్తికరంగా మారింది.