Karimnagar:
విధాత: సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన ప్రేమ విషాదంతంగా ముగిసింది. తమ ప్రేమను ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని భావించిన ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలో జరిగింది. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన మినుగు రాహుల్(18)కు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్రచింతల్ గ్రామానికి చెందిన గోలేటి శ్వేత(20)కు మధ్య సామాజిక మాధ్యమంలో కొద్ది నెలల క్రితం పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ప్రేమించుకున్న వారిరువురు పెళ్లి చేసుకుందామని భావించారు. తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో ఒప్పుకోరని భావించి క్షణికావేశంలో ఇద్దరు జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ రైల్వేస్టేషన్-పాపయ్యపల్లె గేట్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.