Banana Cultivation | బీద్ జిల్లా ( Beed District ) అష్టి తాలుకాలోని చించల గ్రామం( Chinchala village )లో నీటి ఎద్దడి ఉంది. కరువు( Drought ) పరిస్థితులు అనేకం. మరి కరువు నేలలోనూ పంటలు పండించి అద్భుతాలు సృష్టించాలనుకున్నాడు యువ రైతు అశోక్ పోకలే( Ashok Pokale ). దాంతో తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో అరటి సాగు( Banana Cultivation ) చేయాలని సంకల్పించాడు. అనుకున్నదే ఆలస్యం.. అరటి సాగుపై అవగాహన సంపాదించాడు.
3200 అరటి మొక్కలను నాటాడు..
ఇక 2025లో తన రెండున్నర ఎకరాల్లో గ్రాండ్ నైన్ రకానికి చెందిన 3200 అరటి మొక్కలను నాటాడు. పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేశాడు. ఇక నీటి ఎద్దడి కారణంగా.. బిందు సేద్యం ప్రారంభించాడు. రసాయన ఎరువులకు బదులుగా ఆవుపేడ, వర్మీకంపోస్టు వినియోగించాడు.
ఏడాది తిరిగేలోపు.. 70 టన్నుల అరటి పండ్ల ఉత్పత్తి
ఏడాది తిరిగేలోపు.. అరటి మొక్కలు దిగుబడిని సాధించాయి. మొత్తం 70 టన్నుల అరటి పండ్లను పండించగలిగాడు. ఈ సాగు ప్రారంభానికి రూ. 4.5 లక్షల వరకు ఖర్చు పెట్టాడు. అయితే పెట్టిన పెట్టుబడికి నాలుగు రెట్లకు పైగా లాభం గడించాడు.
విదేశాల్లో భారీగా డిమాండ్
అశోక్ పోకలే పండించిన అరటి పండ్లకు దేశీయంగా కంటే విదేశాల్లో భారీగా డిమాండ్ ఉంది. ఇరాన్, ఇరాక్ దేశాలకు చెందిన వ్యాపారులు.. నేరుగా పోకలే వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని అరటి పండ్లను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. కిలో అరటి పండ్లను రూ. 18 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అలా మొత్తం 70 టన్నుల దిగుబడికి రూ. 12 లక్షల 60 వేల ఆదాయం వచ్చినట్లు పోకలే తెలిపారు.
కరువు పీడిత ప్రాంతంగా ప్రసిద్ధి
అయితే అష్టి తాలుకాలో కరువు కరాళ నృత్యం చేస్తుంది. కరువు పీడిత ప్రాంతంగా ప్రసిద్ధిగాంచింది. ప్రతికూల పరిస్థితుల కారణంగా వర్షాభావం కూడా తక్కువే. దీంతో వ్యవసాయం చేయడం కూడా కష్టం. ఈ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ నీటి వినియోగంతో పండించే పంటలపై దృష్టి సారించి.. అరటి సాగుపై దృష్టి సారించినట్లు పోకలే పేర్కొన్నాడు. అలా అరటి సాగు చేపట్టి.. ఏడాది తిరిగేలోపే పెట్టిన పెట్టుబడికి నాలుగింతలకు పైగా రాబడి సాధించాడు అశోక్ పోకలే.
