Site icon vidhaatha

శివమెత్తిన సంజూ – హైదరాబాద్​లో భారత్​ టి20 అత్యధిక స్కోరు

హైదరాబాద్​ వేదికగా భారత్​ – బంగ్లాదేశ్​(India – Bangladesh)ల మధ్య జరిగిన ఆఖరి టి20(T20 match) పోరులో భారత్​ రికార్డు స్కోరు నమోదు చేసింది. సంజూ శాంసన్​, సూర్యకుమార్​ విరుచుకుపడటంతో భారత్​ నిర్ణీత 20 ఓవర్లలో 297 పరుగుల భారీ స్కోరు చేసింది(297/6). తదనంతరం బంగ్లా తన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది(164/7). భారత్​ 133 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి, సిరీస్​ను 3–0తో క్లీన్​ స్వీప్​ చేసింది.

20 ఓవర్లు, 120 బంతులు, 297 పరుగులు, 22 సిక్సర్లు, 25 ఫోర్లు..

ఇవి ఓ ఊచకోతకు సాక్ష్యాలు. దీనికి వేదిక హైదరాబాద్​. భారత్​, బంగ్లాల తుది టి20 పోరులో ఇండియా బ్యాటింగ్​లో పెను విధ్వంసం సృష్టించింది. భారత ఇన్నింగ్స్​ ఆద్యంతం రికార్డులతో హోరెత్తిపోయింది.

టాలెంట్​ ఉన్నా, దురదృష్టం వెంటాడుతున్న సంజూ శాంసన్​(Sanju Samson)దే ఈ రోజు. బంగ్లాదేశ్​ బౌలర్లపై నిర్దాక్ష్యిణ్యంగా విరుచుకుపడి సంజూ బాదిన బౌండరీలతో ఉప్పల్​ స్టేడియం తడిసి ముద్దయింది. సంజూ పరుగుల జోరువానకు తోడు కెప్టెన్​ సూర్య(Surya Kumar Yadav) సుడిగాలితో పరుగుల సునామీ హైదరాబాద్​ను ముంచెత్తింది. తామేమీ తక్కువ కాదన్నట్లు వచ్చినవారు వచ్చినట్లు బాదుడే బాదుడయ్యేసరికి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది.  ఇందులో 232 పరుగులు కేవలం సిక్స్​లు, ఫోర్ల ద్వారా వచ్చేనవే అంటే దాడి ఏ స్థాయితో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ టి20ల్లో భారత్​కిదే అత్యధిక స్కోరు(India’s highest score in T20Is). మొత్తం టి20 ఇంటర్నేషనల్స్​లో రెండో అత్యధికం. మొదటి స్థానంలో నేపాల్​ ఉంది. ఆసియా గేమ్స్​లో నేపాల్​, మంగోలియాపై 314 పరుగులు చేసింది. అయితే టెస్ట్​లు ఆడే దేశాలకు సంబంధించి ఇదే అత్యధిక టి20 స్కోరు.

ఓపెనర్​గా వచ్చిన సంజూ శాంసన్​, అభిషేక్​ శర్మలు ధాటిగానే బ్యాటింగ్​ ప్రారంభించారు. సంజూ ఆదినుండే దంచుడు మొదలుపెట్టాడు. అభిషేక్​ ఒక ఫోర్​ కొట్టి, 23 పరుగుల స్కోరు వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత మొదలైంది హరికేన్​ విధ్వంసం. కెప్టెన్​ సూర్య, సంజూతో జత కలిసి వానకు గాలిలా తోడయ్యాడు. వీరిద్దరూ 2 వికెట్​కు 173 పరుగులు(173 runs for 2nd wicket) జోడించారు. ముఖ్యంగా సంజూ శాంసన్​ను ఆపే బౌలరే కరువయ్యాడు. ఇన్నింగ్స్​ పదో ఓవర్లో, రిషద్​ హొస్సేన్​ బౌలింగ్​లో మొదటి బంతిని వదిలి, మిగిలిన 5 బంతులను సిక్సర్లు( 5 Sixers in 10th Over)గా మలిచాడు. అంతర్జాతీయ టి20ల్లో తన తొలి సెంచరీ నమోదు చేసిన సంజూ (47 బంతుల్లో 111 పరుగులు: 8 సిక్స్​లు, 11 ఫోర్లు ) ముస్తఫిజుర్​ బౌలింగ్​లో ఔటయ్యాడు. తర్వాత కొద్దిసేపటికే సూర్య(35 బంతుల్లో 75: 5 సిక్స్​లు, 8 ఫోర్లు) కూడా పెవిలియన్​ చేరాడు. కానీ, పరుగుల వేగం ఏమాత్రం తగ్గలేదు. రియాన్​ పరాగ్​(13 బంతుల్లో 34: 4 సిక్స్​లు, 1ఫోర్​) హార్థిక్​ పాండ్యా(18 బంతుల్లో 47: 4 సిక్స్​లు, 4 ఫోర్లు), చివర్లో ఒక సిక్స్​తో రింకూ ఇన్నింగ్స్​ను ముగించాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది.

అనంతరం అసాధ్యమైన లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్​కు వచ్చిన బంగ్లాలు కూడా ధాటిగానే ఆరంభించారు. వికెట్లు పడుతున్నా, వారు కూడా తగ్గకుండా బ్యాటింగ్​ కొనసాగించారు. పోరాడి ఓడాలన్న వాళ్ల ఆలోచన వారితో 164 పరుగులు చేయించింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి ఓటమి పాలైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహీద్​ హృదయ్​(63), లిటన్​ దాస్​(42) ఓ మాదిరి పోరాటం చేసినా, మిగతా వారు ఎవరూ నిలబడలేకపోయారు.

 

 

Exit mobile version