India Crush Pakistan in High-Voltage T20 World Cup 2026 Clash : Enters Super-8
పాక్పై పిడుగులా పడిన భారత్ ⚡🏏
టి20 వరల్డ్కప్ 2026లో కొలంబో వేదికగా భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది. ముందుగా 175/7 స్కోరు చేసిన భారత్, బౌలింగ్లో కట్టుదిట్టంగా రాణించి పాక్ను 130 పరుగులకే కట్టడి చేసింది. ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులతో మ్యాచ్ మోమెంటమ్ మార్చగా, బుమ్రా, పాండ్యా, అక్షర్, వరుణ్ తలా రెండేసి వికెట్లు సాధించి విజయానికి బలమైన పునాది వేశారు. ఈ ఘనవిజయంతో భారత్ 6 పాయింట్లతో గ్రూప్లో అగ్రస్థానాన్ని స్థిరపరచుకుని సూపర్–8లోకి తొలి జట్టుగా ప్రవేశించింది.
- ఇషాన్ కిషన్ మరోసారి వీరవిహారం
- బీరాలు పలికి బెంబేలెత్తిన పాక్ బ్యాటర్లు
- తేలిపోయిన ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్
విధాత క్రీడా విభాగం | ఫిబ్రవరి 15, 2026 | హైదరాబాద్:
T20 CWC : IND vs PAK | భారత్తో ఆడమంటూ ఐసీసీని బెదిరించాలని చూసిన పాకిస్థాన్, అసలు ఎందుకు ఆడనందో భారత్ అర్థం చేయించింది. కొలొంబో ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచి భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించి పెద్ద తప్పు చేసిన పాక్ తగిన మూల్యం చెల్లించుకుంది. ముందుగా భారత్ చేసిన 175 పరుగులను స్పిన్వలలో చిక్కుకుని ఛేదించలేక 130 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవం మూటగట్టుకుంది. దీంతో 61 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన భారత్, 6 పాయింట్లతో 3.05 నెట్రన్రేట్తో గ్రూప్లో అగ్రస్థానాన్ని భారత్ స్థిరపరచుకుంది. సూపర్–8లోకి ప్రవేశించిన తొలి జట్టుగా నిలిచింది.
హైవోల్టేజ్ మ్యాచ్లో ఫ్యూజులు ఎగిరిపోయిన పాక్ బ్యాటింగ్
భారత్ విధించిన 175 పరుగుల కఠిన లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన పాక్ బ్యాటర్లు ప్రారంభంలోనే చేతులెత్తేసారు. సున్నాకే మొదటి వికెట్ సమర్పించుకున్న పాక్, 13 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి మ్యాచ్పై పట్టు వదిలేసుకుంది. ఇక ఏ దశలోనూ పాకిస్థాన్ బ్యాటర్లు దూకుడు ప్రదర్శించలేకపోయారు. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్(0), సయిమ్ అయూబ్(6), కెప్టెన్ సల్మాన్ ఆఘా(4), ఫేమస్ బాబర్ ఆజమ్(5)..ఇలా అందరూ పెవిలియన్లో ఏదో పనున్నట్లు వెళ్లిపోయారు. ఒక్క ఉస్మాన్ ఖాన్(44) కాసేపు ప్రతిఘటించినా అది కంటితుడుపుగానే మిగిలిపోయింది. చివరకు 18 ఓవర్లలో పాకిస్థాన్ 1114 పరుగులకే కుప్పకూలింది.
భారత బౌలర్లలో బుమ్రా, పాండ్యా, అక్షర్, వరుణ్ తలా రెండేసి వికెట్లు తీసుకోగా, కుల్దీప్, తిలక్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
మళ్లీ ఇషాన్ తుఫాన్ – పవర్ప్లేలో 86 పరుగులు
కాగా, టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 175/7 స్కోరు నమోదు చేసింది. పవర్ప్లేలో దూకుడు, మధ్య ఓవర్లలో నిలకడ, చివర్లో కీలక పరుగులతో భారత్ సమతులిత ఇన్నింగ్స్ ఆడింది.
టాస్ అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. అభిషేక్ శర్మ త్వరగా ఔటయినా, ఇషాన్ కిషన్ పాకిస్తాన్ బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించాడు. షాహీన్ అఫ్రిది, సల్మాన్ ఆఘా బౌలింగ్లో పవర్ప్లేలోనే పరుగుల వర్షం కురిపించాడు. పవర్ప్లే 6 ఓవర్లలో భారత్ 86/2 స్కోరు సాధించింది. ఇషాన్ కేవలం 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్కు బలమైన పునాది వేసాడు. మొత్తం 40 బంతుల్లో 77 పరుగులు (10 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి ఇన్నింగ్స్కు వెన్నెముకలా నిలిచాడు.
పాక్ స్పిన్ పంజా.. మధ్య ఓవర్లలో నెమ్మదించిన వేగం
ఇషాన్ ఔటైన తర్వాత పాకిస్తాన్ స్పిన్నర్లు మ్యాచ్ను కట్టుదిట్టం చేశారు. సైమ్ అయూబ్ కీలక సమయంలో రెండు వికెట్లు తీసి భారత్ పరుగుల వేగాన్ని గణనీయంగా తగ్గించాడు. ఉస్మాన్ తారిక్, మొహమ్మద్ నవాజ్ కలిసి మధ్య ఓవర్లలో పరుగుల ప్రవాహాన్ని నియంత్రించారు.
సూర్యకుమార్ యాదవ్ 32 పరుగులతో ఇన్నింగ్స్ను నిలబెట్టినా, పెద్దగా వేగం పెరగలేదు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య త్వరగా ఔటవడంతో 15వ ఓవర్ సమయానికి భారత్ కొంత ఒత్తిడిలోకి వెళ్లింది.
చివరి ఓవర్లలో రింకూ – దూబే కీలక పాత్ర
చివరి మూడు ఓవర్లలో రింకూ సింగ్, శివం దూబే వేగం పెంచే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చివరి ఓవర్లో వచ్చిన బౌండరీలు భారత్ను 175 దాటేలా చేశాయి. రింకూ చిన్నదైనా ప్రభావవంతమైన ఇన్నింగ్స్ (4 బంతుల్లో 11 పరుగులు) ఆడగా, దూబే 27 పరుగులతో సహకరించాడు.
పాకిస్థాన్ బౌలర్లలో సయిమ్ అయూబ్ 3 వికెట్లు తీసుకోగా, కెప్టెన్ ఆఘా, ఆఫ్రిది, ఉస్మాన్ తారిఖ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా భారత ప్రభంజనం ఇషాన్ కిషన్ ఎంపికయ్యాడు. దీంతో భారత్ 6 పాయింట్లతో భారీ రన్రేట్తో సూపర్–8లోకి ప్రవేశించింది. కాగా, తదుపరి ఈనెల 18వ తేదీన నెదర్ల్యాండ్స్తో తలపడనుంది.
