అదృష్టం అంటే వీరిదే..జలపాతంలో కొట్టుకుపోతూ బతికేశారు!

కర్ణాటకలోని మల్లల్లి జలపాతం వద్ద వరద ప్రవాహంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను అగ్నిమాపక సిబ్బంది సాహసోపేతంగా రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jul 07, 2026, 4:46 pm IST
Read Time: 4 mins
అదృష్టం అంటే వీరిదే..జలపాతంలో కొట్టుకుపోతూ బతికేశారు!

భూమిపై నూకలుంటే ఎన్ని ప్రాణ గండాలైన దాటేస్తారనడానికి జలపాతం వరద ఉదృతిలో చిక్కిన ఇద్దరు యువకుల అదృష్ట ఘటన నిదర్శనంగా నిలుస్తుంది. కర్ణాటకలోని మల్లల్లి జలపాతం వద్ద హెచ్చరిక సంకేతాలను విస్మరించి రక్షణ కంచెను దాటిన ఓ ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు అద్భుతంగా ప్రాణాలతో బయటపడిన వీడియో వైరల్ గా మారింది.

సోమవార్‌పేట తాలూకాలోని మల్లల్లి జలపాతం వద్ద ప్రవహిస్తున్న నదీ ప్రవాహంలోకి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గణేష్ నాయక్ (21), సంతోష్ కుమార్ (23) అనే ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు దిగారు. అదే సమయంలో మల్లలి జలపాతం సమీపంలోని జలవిద్యుత్ కేంద్రం నుండి అకస్మాత్తుగా వచ్చిన నీటి ప్రవాహంతో పెరిగిన జలపాతం వరద ఉదృతిలో వారిద్దరు చిక్కుకుపోయారు. గంటసేపు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రవాహం నుంచి జలపాతంలోని దిగువకు కొట్టుకపోకుండా కొండరాళ్లను పట్టుకున్నారు. వారు ఉన్న చోట కొంత వరద ఉదృతి తక్కువగా ఉండి..వారి చుట్టు మాత్రం వరద ఉదృతి దిగువకు భయంకరంగా దూసుకెలుతుండటం చూస్తుంటే వారు బతకడం అసాధ్యం అనిపించకమానదు.

మల్లల్లి జలపాతంలో ఇద్దరు యువకులు చిక్కుకున్న సమాచారాన్ని అందుకున్న ‘టూరిస్ట్ మిత్ర’ నాగేంద్ర నేతృత్వంలోని అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో బరువైన తాడులను ఉపయోగించి వారిని సురక్షితంగా బయటకు లాగారు. శక్తివంతమైన ఉధృత ప్రవాహంలో వారు కొట్టుకపోకుండా కాపాడారు. ఈ సంఘటన జలపాతాల వద్ద ఎదురయ్యే ప్రమాదాలను ఎత్తి చూపుతోంది. జలపాతాలు, కొండలు, నది ప్రాంతాలు, సముద్ర తీరాల వద్ద భద్రతా నియమాలను పాటించకుండా ఇష్టా రాజ్యంగ వ్యవహరించే వారికి ఈ ఘటన ఓ హెచ్చరిక వంటిదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.