విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గుదలను నమోదు చేశాయి. మంగళవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,530 తగ్గి.. రూ.1,54,910వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,400 తగ్గి.. రూ. 1,42,000వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర సైతం రూ.15,000 తగ్గి.. రూ. 2,65,000వద్ద నిలిచింది.
ధరలలో మార్పులు ఎలా ఉండబోతున్నాయో ?
బంగారం ధరలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు, బాండ్ దిగుబడులు, ప్రపంచ ద్రవ్యత వంటి అంశాలతో ముడిపడి ఉండటంతో, ధరల హెచ్చుతగ్గులు అనివార్యమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీర్ఘకాలిక దృష్టితో చూస్తే ఈ ధరల అస్థిరత పెద్ద సమస్య కాదని.. బంగారం ఇంకా బలమైన పెట్టుబడిగానే కొనసాగుతుందంటున్నారు.
అలాగే వెండి ధరలు సైతం గత కొంత కాలంగా నేల చూపులు చూస్తున్నాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై పెరుగుతున్న అనిశ్చితి కారణంగా వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. గ్లోబల్ మార్కెట్లలో వడ్డీ రేట్లపై స్పష్టత లేకపోవడం, ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఎప్పుడు తగ్గిస్తుందన్న గందరోళంల బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తోంది.
ఈ దశలో వెండిపై పెట్టుబడి పెట్టాలా? వద్దా ? అనే దానిపై మార్కెట్ నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. దీర్ఘకాలిక దృష్టితో చూస్తే వెండి ఇప్పటికీ ఆకర్షణీయమైన లోహంగానే భావించవచ్చని చెబుతున్నారు. పరిశ్రమల వినియోగం, గ్రీన్ ఎనర్జీ, సోలార్ ప్యానెల్స్ వంటి రంగాల్లో వెండి డిమాండ్ పెరుగుతోందని గుర్తు చేస్తున్నారు. అయితే స్వల్పకాలంలో మాత్రం ధరలు మరింత ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితుల మధ్య పెట్టుబడిదారులు వెండిపై ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా.. దశలవారీగా పెట్టుబడులు పెట్టడం మంచిదని సూచిస్తున్నారు.
