Dasara Dhamaka | మంచిర్యాల : దసరా పండుగ( Dasara Festival )కు తెలంగాణ( Telangana ) పల్లెల్లు సిద్ధమవుతున్నాయి. మరో వారం రోజుల్లో బతుకమ్మ వేడుకలు( Bathukamma Festival ) ప్రారంభం కానున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో ఓ ఆరుగురు యువకులు సరికొత్త ఆఫర్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఇలాంటి ఆఫర్ చూసి ఉండరు. బోయపల్లి వారి దసరా ధమాకా( Boyapally Vari Dasara Dhamaka ) పేరుతో లక్కీ డ్రా( Lucky Draw ) నిర్వహిస్తున్నారు. ఈ లక్కీ డ్రాలో మొదటి బహుమతి కింద గొర్రె పొట్టేలు( Sheep ), రెండో బహుమతి కింద మేక( Goat )ను అందజేయనున్నారు. మూడు నుంచి ఆరు బహుమతుల వరకు విలువైన మద్యాన్ని( Wine ) బహుకరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా( Mancherial ) తాండూరు మండల పరిధిలోని బోయపల్లి( Boyapally )కి చెందిన ఆరుగురు యువకులు ఇంట్రెస్టింగ్ ఆఫర్ను ప్రకటించారు. దసరాకు బోయపల్లి వారి దసరా ధమాకా పేరుతో సరికొత్తగా లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఒక్కో కూపన్ను కేవలం రూ. 100కు మాత్రమే విక్రయిస్తున్నారు. ఇక లక్కీ డ్రాను దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 10వ తేదీన తీయనున్నారు.
ఈ లక్కీడ్రాలో మొదటి బహుమతి పొందిన వారికి గొర్రె పొట్టేలు, రెండో బహుమతి కింద మేకను ఇవ్వనున్నారు. మూడో బహుమతి కింద జానీ వాకర్( Johnnie Walker ) ఫుల్ బాటిల్, నాలుగో బహుమతి కింద టీచర్స్( Teachers ) ఫుల్ బాటిల్, ఐదో బహుమతి కింద బ్లాక్ డాగ్( Black Dog ) ఫుల్ బాటిల్, ఆరో బహుమతి కింద 100 పైపర్స్( 100 Pipers ) ఫుల్ బాటిల్ ఇచ్చి సర్ప్రైజ్ చేయనున్నారు. ఏడు, ఎనిమిది బహుమతుల కింద నాటుకోడి పుంజు, తొమ్మిది, పదో బహుమతి కింద నాటుకోడి పెట్టెను ఇవ్వనున్నట్లు లక్కీ డ్రా నిర్వాహకులు ప్రకటించారు. కూపన్ ధరను రూ. 100గా నిర్ణయించారు. కూపన్ను కొనుగోలు చేయాలనుకునే వారు 9492970353, 8977307730 (ఫోన్ పే) నంబర్లకు ఫోన్ పే ద్వారా రూ. 100 చెల్లించి పొందొచ్చు.
ఈ సందర్భంగా లక్కీ డ్రా నిర్వాహకుల్లో ఒకరైన విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటికే 600 కూపన్లు అమ్ముడుపోయినట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా నుంచే కాకుండా.. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, హైదరాబాద్తో పాటు మహారాష్ట్ర వాసులు కూడా కూపన్లను కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. బోయపల్లి వారి దసరా ధమాకా ఆకర్షణీయంగా మారిందన్నారు.