విధాత, హైదరాబాద్ : ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని ప్రమాణం చేసి ఇంకో చేత్తో బీఆరెస్ ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో రాహుల్ గాంధీ కరచాలనం చేశాడని ఇదేనా రాజ్యాంగం పట్ల..ఫిరాయింపులపై మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలపై మీ చిత్తశుద్ధి అని బీఆరెస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు తాను రాహుల్గాంధీకి బహిరంగ లేఖ రాసినట్లుగా వెల్లడించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను రక్షించడం, గౌరవించడం మా బాధ్యత అని, దివంగత రాజీవ్ గాంధీ హయాంలో తెచ్చిన యాంటీ డిఫెక్షన్ లాను మరింత పటిష్టం చేసి అమలు చేస్తామన్న రాహుల్గాంధీ తెలంగాణలో బీఆరెస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకుంటూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాడని లేఖలో ఆరోపించారు. రాజకీయ విలువలు, ధర్మసూత్రాలకు రాహుల్ కట్టుబడి ఉంటే పార్టీలో చేర్చుకున్న వారితో రాజీనామా చేయించమని ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. కేశవరావుతో రాజీనామా చేయించినట్లు పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాజీనామా చేసి రావాలని రాహుల్ గాంధీ ఎందుకు చెప్పడం లేదన్నారు. రాహుల్ మాటలు అన్నీ డబల్ స్టాండర్డ్ అని దేశం భావించదా ? అని ప్రశ్నించారు. రాజీనామా చేయించి ఎన్నికల్లో తేల్చుకునే సత్తా లేదా? పిరికివాళ్లా? అని ఎద్దేవా చేశారు. ఈ లేఖ అంశాన్ని ఇక్కడితో వదలబోమని, జాతీయ స్థాయిలో ప్రశ్నిస్తామని, స్వయంగా రాహుల్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ మీద బీజేపీ అక్రమ కేసులు వేసి, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి, అయన క్వార్టర్ ఆగమేఘాల మీద రద్దు చేసి అమానుషంగా ప్రవర్తించినప్పుడు పార్టీలకు అతీతంగా సానుభూతి చూపించామన్నారు. సర్వోన్నత న్యాయస్థానం మీద నమ్మకం ఉందని రాహుల్ అంటాడని, అదే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు పార్టీ మారిన వారి సభ్యత్వం రద్దు కావాలి అని చెబితే ఎందుకు తెలంగాణ కాంగ్రెస్ స్పీకర్ను ఆ పని చేయమని ఆదేశించడం లేదన్నారు. రాహుల్ మీ డబల్ స్టాండ్స్ చూసి మిగతా రాష్ట్రాల ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించరా ? మిమ్మల్ని ఎలా నమ్ముతారని నిలదీశారు. ఏడుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకోలేని రాహుల్ దేశాన్ని ఎలా మెప్పిస్తాడని ప్రశ్నించారు.
ఆరు గ్యారంటీల అమలులో విఫలం
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటీతో ఏడు మాసాలు పూర్తి అవుతుందని, ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని, కానీ ఏడుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నం.. బీఆరెస్ పనైపోయిందని విన్యాసాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. భారత పార్లమెంటులో కాంగ్రెస్ ప్రాతినిధ్యం కేవలం 20శాతం మాత్రమేనని,అంతకు ముందు కేవలం పది శాతానికి పరిమితమైందని, కానీ అసెంబ్లీలో బీఆరెస్ 33శాతం ప్రాతినిధ్యం కలిగివుందని, అంటే బీఆరెస్ ఉన్నట్టా లేనట్టా? అని నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. గతంలో బీఆరెస్ చేరికలపై చట్టబద్ధంగా వ్యవహరించిందని, రాజ్యాంగ బద్దంగా బీఆరెస్లో విలీనాలు జరిగాయన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి బీఆరెస్ నేతల ఇండ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారని తప్పుబట్టారు. రాహుల్గాంధీ నోటి నుండి చెప్పిన ప్రకారం తెలంగాణలో ఆరు గ్యారంటీలకు దిక్కు లేదని, ఆరుగ్యారంటీల పేరుతో తెలంగాణలోని అన్ని వర్గాలను వంచించారన్నారు. నిరుద్యోగులను అమానుషంగా మోసం చేశారని,మీరు ఇచ్చిన హామీలపై ఆశపడ్డ వర్గాలు భవిష్యత్తులో ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాయన్నారు.
మానిన గాయాలను మళ్లీ రలించేందుకే భేటీ
గత పదేండ్ల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరి మానాన వారు బతుకుతున్నారని, కానీ మానిన గాయాలను మళ్లీ రగిల్చేందుకు చంద్రబాబు, రేవంత్ కలిసి కుట్రలు చేస్తున్నారని నిరంజన్రెడ్డి ఆరోపించారు. ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండడం అభ్యంతరం లేదని, కానీ ఇక్కడ మేం మళ్లీ మా పాత్ర పోషిస్తామని రాజకీయ ఆర్భాటాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆంధ్రాలో పెళ్లి కొడుకు అయితే.. తెలంగాణలో ఎందుకు పందిరి వేస్తున్నారో అర్థం కావడం లేదని రేవంత్, చంద్రబాబు భేటీపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు ఆంధ్రాలో సీఎం అయ్యారు. తెలంగాణ రాజధానిలో ఎందుకు పందిరి వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పెళ్లికొడుకు ఒకచోట.. పెళ్లి ఒకచోట.. పందిరి మాత్రం తెలంగాణలో వేస్తున్నరని, ఆర్భాటం హైదరాబాద్లో చేస్తున్నరని, హైదరాబాద్లో ఆర్భాటం ఎందుకు..? ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. అపరిష్కృత అంశాల మీద చర్చ అనుకుంటే ఆ అడుగులు వేరేలా ఉండేవని, కానీ అలా లేవని, పరోక్షంగా తెలంగాణను పరిపాలించేటటువంటి కుట్ర ప్రారంభమైందని, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను అని నిరంజన్ రెడ్డి తెలిపారు.