Middle East Airspace Closed After US–Israel Strikes On Iran; Global Flights Disrupted
- అమెరికా–ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడులు… దుబాయ్–దోహా హబ్లలో ఫ్లైట్లు రద్దు
గగనతలంపై యుద్ధ ప్రభావం
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభించిన తర్వాత పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ప్రతిగా ఇరాన్ క్షిపణి దాడులు చేపట్టడంతో గల్ఫ్ ప్రాంతం మొత్తం అప్రమత్తమైంది.
ఈ పరిణామాల మధ్య కనీసం ఎనిమిది దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాక్, జోర్డాన్, ఖతార్, బహ్రెయిన్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు పూర్తి లేదా పాక్షిక గగనతల మూసివేత ప్రకటించాయి. సిరియా కూడా ఇజ్రాయెల్ సరిహద్దు సమీపంలో గగనతలాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.
టెహ్రాన్లో పేలుళ్ల తర్వాత విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇజ్రాయెల్లో సైరన్లు మోగించగా, ప్రజలను షెల్టర్లలో ఉండాలని ఆదేశించారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే తన లక్ష్యమని ఇరాన్ ప్రకటించింది.
అంతర్జాతీయ విమానాలకు భారీ అంతరాయం
ఇరాన్, ఇరాక్ పైన భారీ ఖాళీ జోన్ – గగనతల మూసివేత వల్ల విమానాలు దూరంగా మళ్లించబడుతున్నాయి. యూరప్ నుంచి ఇండియాకు వెళ్లే ఫ్లైట్లు దక్షిణంగా లేదా ఉత్తరంగా రూట్ మార్చుకుంటున్నాయి!
మధ్యప్రాచ్యం యూరప్–ఏషియా విమాన మార్గాలకు కీలక కేంద్రం. ఇప్పటికే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగంలో ఉన్న వేళ, తాజా ఎయిర్స్పేస్ మూసివేతలు ప్రపంచ విమాన రవాణాకు గట్టి దెబ్బగా మారాయి.
Lufthansa, Air France, Turkish Airlines, Qatar Airways, British Airways, IndiGo, Air India తదితర ఎయిర్లైన్స్ సేవలను పాక్షికంగా రద్దుచేయడం, వేరే మార్గాన్ని ఎంచుకోవడం చేసాయి.
దుబాయ్, దోహా, అబుదాబి హబ్లలో వందల ఫ్లైట్లు రద్దయ్యాయి. అనేక విమానాలు మధ్యలోనే తిరిగి వెళ్లడం లేదా ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించడం జరిగింది. విమాన ప్రయాణ సమయం పెరగడంతో ఇంధన వ్యయం కూడా అధికమవుతోంది. అమెరికా, ఐరోపా ఖండాలలోని దేశాల నుండి భారత్ సహా ఆసియా దేశాలకు వస్తున్న అత్యధిక విమానాలను తుర్కియే రాజధాని ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి మళ్లించారు.
భారత్ సంసిద్ధత – విమానయాన మంత్రిత్వ శాఖ సమీక్ష
మధ్యప్రాచ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విమాన రవాణా సిద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్న పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు
భారత పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ(Ministry of Civil Aviation – MoCA) అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించింది. మంత్రి రామ్మోహన్ నాయుడు, పౌరవిమానయాన డైరెక్టర్ జనరల్, భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ(AAI), ప్రధాన ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, ఎయిర్లైన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ముఖ్య సూచనలు:
- ఎయిర్స్పేస్ NOTAM(NOtice To the AirMen)లు, విమాన ప్రయాణ మార్గాలను నిశితంగా పరిశీలించాలి.
- అవసరమైతే వెంటనే రీరూటింగ్, డైవర్షన్లు చేయాలి.
- ప్రధాన అంతర్జాతీయ హబ్లలో అత్యవసర ల్యాండింగ్స్కు సిద్ధంగా ఉండాలి.
- ప్రయాణికులకు ముందస్తు సమాచారం అందించాలి.
ఎయిర్లైన్స్ ప్రకటనలు
Air India
మధ్యప్రాచ్య గమ్యస్థానాలన్నింటికీ సేవలు తాత్కాలికంగా నిలిపివేత. ప్రయాణికులు అధికారిక వెబ్సైట్లో ఫ్లైట్ స్టేటస్ పరిశీలించాలని సూచన.
IndiGo
ఇరాన్, పరిసర గగనతల పరిణామాలను రియల్ టైమ్లో పరిశీలిస్తున్నామని, అవసరమైతే మార్పులు చేస్తామని తెలిపింది.
కోచ్చి, తిరువనంతపురం, కన్నూర్, కాలికట్ విమానాశ్రయాల నుండి గల్ఫ్ మార్గాల్లో నడిచే పలు సేవలు రద్దయ్యాయి. ఓమన్ ఎయిర్, ఎతిహాద్ సేవలు ఆలస్యం/డైవర్ట్ అయ్యాయి.
గగనతలాల మూసివేత(ఎయిర్స్పేస్ క్లోజర్) అంటే ఏమిటి?
ఒక దేశం తన గగనతలాన్ని (ఆకాశ ప్రాంతాన్ని) తాత్కాలికంగా మూసివేయడాన్ని ఎయిర్స్పేస్ క్లోజర్ అంటారు. అంటే ఆ దేశం పైనున్న ఆకాశంలో పౌర, వాణిజ్య విమానాలు ఎగరడం లేదా దాటడం పూర్తిగా నిషేధించబడుతుంది. ప్రతి దేశానికి తన భూభాగంపై ఉన్నట్టే గగనతలంపైనా సార్వభౌమాధికారం ఉంటుంది. భద్రతా పరిస్థితులు విషమిస్తే ఆ దేశం తక్షణమే గగనతలాన్ని మూసివేయగలదు.
ఇరాన్, ఇరాక్, కువైట్ ప్రాంతంలో విమానాలు గుండె ఆకారంలో చుట్టుముట్టి ఉన్నాయి – మధ్యలో భారీ ఖాళీ! భద్రత కోసం ఆ ప్రాంతాన్ని పూర్తిగా అవాయిడ్ చేస్తున్నాయి.
సాధారణంగా యుద్ధ, సైనిక దాడుల భయం, మిసైల్ లేదా డ్రోన్ ప్రమాదం, సైనిక విన్యాసాలు, అత్యవసర పరిస్థితులు వంటి సందర్భాల్లో ఈ నిర్ణయం తీసుకుంటారు. గగనతలం మూసేస్తే విమానాలు ఆ మార్గంలో వెళ్లలేవు. అవి దారి మార్చుకోవాలి. దీంతో ప్రయాణ సమయం పెరుగుతుంది, ఇంధన వ్యయం అధికమవుతుంది, కొన్ని విమానాలు రద్దు లేదా డైవర్ట్ అవుతాయి. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా ఆ ప్రాంతంలోని దేశాలు ఇవే చర్యలు తీసుకుంటున్నాయి.
ప్రస్తుత పరిస్థితులు ఎలా?
: దోహా హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో Qatar Airways విమానాలు గేట్ల వద్ద నిలిచిపోయాయి – ఖతార్ గగనతల మూసివేత వల్ల ఫ్లైట్లు రద్దు/ఆలస్యమవుతున్నాయి!
ప్రస్తుతం పరిస్థితి గందరగోళంగా ఉంది. గగనతల మూసివేతలు మరికొంతకాలం కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దౌత్యపరమైన చర్చలు ప్రారంభమైతేనే విమాన రవాణా సాధారణ స్థితికి వచ్చే అవకాశముంది.
