విధాత, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముందుస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోఖోలు, నిరసన ర్యాలీలకు పాల్పడితే వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎ.వి. రంగనాథ్ హెచ్చరిస్తూ బుధవారం ప్రకటించారు.
ఇకపై రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాలుగాని ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు నిర్వహించాలనుకుంటే ముందస్తుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. అలా కాకుండా ప్రజలతో పాటు ప్రభుత్వ అధికారులు, వాహనదారులను ఇబ్బందులకు గురిచేసేవిధంగా చట్టవిరుద్ధంగా ఆకస్మికంగా ధర్నాలు, నిరసనలు, రాస్తారోఖోల్లో పాల్గోనే వ్యక్తులపై చట్టపరంగా కేసులను నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ముఖ్యంగా వ్యక్తుల ఇండ్ల ముందు, ప్రభుత్వ, ప్రైయిట్ కార్యాలయాలు, వైద్యశాలతో పాటు ప్రధాన రోడ్డు మార్గాలపై ఏవరైనా చట్టవిరుద్ధంగా ముందుస్తు అనుమతులు లేకుండా అకస్మికంగా నిరసనలకు పాల్పడటం సరైంది కాదన్నారు. ఏదైనా సమస్య వుంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని, ప్రజలను, వాహనదారులు, అధికారులను ఇబ్బందులకు గురిచేసే విధంగా వ్యవహరించవద్దన్నారు.
ఇటీవల కాలంలో కొద్ది మంది వివిధ కారణాలతో మరణించిన వ్యక్తుల మృతదేహాలను ఇల్లు, ప్రభుత్వ కార్యాలయం ఆవరణలో వుంచి, మీరే మరణానికి కారకులంటూ ఇంటి యజమానులు, అధికారులను డబ్బులను డిమాండ్ చేస్తూ ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని తెలిపారు.
దీనివల్ల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. కనుక ఏదైనా సమస్య వుంటే న్యాయంపరంగా అధికారుల దృష్టికి తీసుకుపోవాలని పోలీస్ కమిషనర్ రంగనాథ్ కోరారు.