విధాత, హైదరాబాద్ : ‘తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012’(G.O.Ms.No.95)కి సంబంధించి ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. కొత్త రూల్స్ కు సంబంధించి సవరణ ఉతర్వులను జారీ చేసింది. టీడీఆర్ వినియోగంపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కొత్త నిబంధనల మేరకు 21 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తుతో నిర్మించనున్న వాటిని హైరైజ్ భవనాలుగా గుర్తించనున్నారు. 750 చ.మీ నుంచి 2000 చ.మీలు ఉన్న స్థలంలో 18-21 మీటర్ల భవనాలు నిర్మించాలంటే టీడీఆర్ వినియోగం తప్పనిసరి చేశారు. నాన్ హైరైజ్ భవనాలకు టీడీఆర్ వినియోగంతో సెట్బ్యాక్ సడలింపు ఇచ్చారు.
హైరైజ్ భవనాల్లో 10 శాతం సెట్బ్యాక్ రిలాక్సేషన్కు అనుమతించింది. 2000 చదరపు మీటర్లకు పైగా ప్లాట్లలో అదనపు అంతస్తులకు అవకాశం కల్పించారు. 40 ఫీట్ రోడ్ వద్ద 3 అదనపు అంతస్తులకు అనుమతించింది. 60 ఫీట్ రోడ్ వద్ద 4 అదనపు అంతస్తులకు అనుమతించింది. 80 ఫీట్ రోడ్ వద్ద 5 అదనపు అంతస్తులకు అనుమతించింది. 10 అంతస్తులపైగా భవనాల్లో 3 శాతం టీడీఆర్ లోడింగ్ తప్పనిసరి చేసింది. 20 అంతస్తులపైగా భవనాలకు 5 శాతం టీడీఆర్ నిర్ణయించింది. బిల్డింగ్ అనుమతికి 50 శాతం టీడీఆర్ తప్పనిసరి చేసింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్కు ముందు మిగతా 50 శాతం చెల్లించాలని పేర్కొంది. 10శాతం నుంచి 5శాతానికి తాకట్టు అవసరాన్ని తగ్గించారు.
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ 2016లో నిర్మాణ అనుమతులకు కొత్త చట్టాలను తీసుకొచ్చింది. వాటిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కూడా క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం దిశగా ‘తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012’లో మార్పులు చేస్తూ కొత్త నిబంధనలను తీసుకొస్తూ జీవో జారీ చేసింది.
