సీఎం రేవంత్రెడ్డితో సీఎల్పీ సమావేశానికి హాజరు
Abhishek Manu Singhvi | తెలంగాణ నుంచి రాజ్యసభ ఉపఎన్నికల్లో పోటీ చేయనున్న సీనియర్ కాంగ్రెస్ నేత, పార్టీ లీగల్ సెల్ ఇంచార్జి అభిషేక్ మను సింఘ్వీ ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎల్పీ (Congress CLP) సమావేశంలో ఆయన సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) తో కలిసి హాజరుకానున్నారు. అంతకుముందు సింఘ్వీకి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణు గోపాల్ స్వాగతం పలికారు.
అక్కడి నుంచి సింఘ్వీ ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు (K Keshava rao) నివాసానికి వెళ్లారు. అనంతం నానక్ రామ్ గూడలోని ప్రైవేట్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న సీఎల్పీ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో సింఘ్వీని ఎమ్మెల్యేలకు, పార్టీ ఇతర ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్రెడ్డి పరిచయం చేస్తారు. రాజ్యసభ సభ్యుడిగా సింఘ్వీ ఎన్నికకు సహకరించాలని రేవంత్రెడ్డి ఎమ్మెల్యేలను కోరనున్నారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం అభిషేక్ మను సింఘ్వీ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ (Rajya Sabha ) అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.