Telangana Tenth Exams | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి పరీక్షల( Telangana Tenth Exams )నిర్వహణకు విద్యాశాఖ( Education Department ) ఏర్పాట్లు ముమ్మరం చేసింది. 2026 మార్చి 18వ తేదీ నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు టెన్త్ ఎగ్జామ్స్కు సంబంధించిన టైమ్ టేబుల్ను విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం ఆమోదం తెలపగానే పదో తరగతి పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్ విడుదల కానుంది. ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన మరుసటి రోజు నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
పదో తరగతి పరీక్షా ఫీజు స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో 10 రోజులు పొడిగించాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ పాఠశాల విద్యాశాఖ అధికారులను కోరింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు పీ రాజా భాను చంద్ర ప్రకాశ్ మాట్లాడుతూ.. ఆన్లైన్లో ఫీజు చెల్లింపుల విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ క్రమంలో గడువు పొడిగించాలన్నారు.
