విధాత,న్యూఢిల్లీ:విశాఖ స్టీల్ ప్లాంట్(ఆర్ఐఎన్ఎల్)కు జార్ఖండ్లోని రబోధి బొగ్గు గనులు కేటాయిస్తూ 2019లోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. కోకింగ్ కోల్ లభించే రబోధి బొగ్గు గనిని ఆర్ఐఎన్ఎల్కు కేటాయిస్తున్నట్లుగా నామినేటెడ్ అథారిటీకి 2019 డిసెంబర్ 16న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఐఎన్ఎల్కు అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని కూడా ఆ ఆదేశాలలో స్పష్టంగా కోరడం జరిగింది. ఆర్ఐఎన్ఎల్కు బొగ్గు గనులను కేటాయించాలని కోరుతూ బొగ్గు మంత్రిత్వ శాఖకు పలు దఫాలుగా విజ్ఞప్తులు వచ్చిన విషయం వాస్తవమే. ఆ విజ్ఞప్తుల మేరకే ఆర్ఐఎన్ఎల్కు రబోధి గనుల కేటాయింపు జరిగింది. అయితే ప్రభుత్వ రంగ సంస్థలలో కొన్నింటిని వ్యూహాత్మక విక్రయం చేయాలన్న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు ఆర్ఐఎన్ఎల్లోని నూరు శాతం ప్రభుత్వ పెట్టుబడులను ఉపసహంరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.