ఈనెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు జగన్ కుటుంబం
విధాత : ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట దక్కింది. కొన్ని నెలలుగా ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తీరిక లేకుండా గడిపిన వైఎస్ జగన్ ఎన్నికలు ముగిసిన అనంతరం కుటుంబ సమేతంగా లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరారు. జగన్ అభ్యర్థనపై విచారించిన కోర్టు ఈనెల 17నుంచి జూన్ 1వరకు జగన్ లండన్ వెళ్లేందుకు అనుమతినిచ్చింది. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో పర్యటించేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని జగన్ గత వారమే పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమాస్తుల కేసులో విచారణ జరుగుతోందని, అనుమతి ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం జగన్ విదేశీ పర్యటనకు అనుమతిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.