Pawan Kalyan| గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసిన, ఎవరి నోట విన్నా పవన్ కళ్యాణ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సారి ఏపీ ఎన్నికలలో గేమ్ ఛేంజర్గా ఉన్న పవన్ కళ్యాణ్.. కూటమి ఘన విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2019 మే 23న లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తల గుండె పవన్ ఓటమితో చెరువైంది. అయితే ఎక్కడ కూడా అధైర్యపడకుండా కూటమిని ఏర్పాటు చేసి ఈ సారి ఘన విజయం దక్కేలా చేశారు. ఆంధ్రప్రదేశ్ 16వ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికకాగా, ఆయన గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్పగా మాట్లాడారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు.
ఎంతో అనుభవమనున్న అయ్యన్నపాత్రుడు స్పీకర్ స్థానంలో కూర్చోవడం ఆనందంగా ఉందన్నారు. ఇన్ని దశాబ్దాల్లో ప్రజలు మీ వాడి వేడి చూశారని , ఇప్పటివరకు ప్రజలు మీ ఘాటైన వాగ్దాటి చూశారని, ఇవాళ్టి నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారని పవన్ చెప్పుకొచ్చారు. అయితే అయ్యన్న పాత్రుడికి తిట్టే అవకాశం లేకపోవడమే బాధేస్తోందంటూ సరదాగా అన్నారు. ఇకనుంచి ఎవరైనా తిట్టినా వాళ్లని అదుపు చేసే బాధ్యత మీపై ఉందని అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. గత ప్రభుత్వంలో వ్యక్తి గత దూషణలు చాలా ఇబ్బంది పెట్టాయని , వైఎస్సార్సీపీ నేతల వ్యక్తిగత దూషణల కారణంగానే వారు 11 సీట్లకు పరిమితమయ్యారంటూ పవన్ విమర్శలు గుప్పించారు.
వారు విజయాన్ని తీసుకోగలిగారు కాని ఓటమిని తట్టుకోలేకపోయారు. అందుకే ఇక్కడ కూర్చోలేకనే పారిపోయారని పవన్ ఎద్దేవా చేశారు. భావంలో ఉన్న తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరంలేదని భాష మనసులను కలపడానికి కానీ విడగొట్టడానికి కాదని ఆయన అన్నారు.విభేదించడం, వాదించడం అనేవి ప్రజాస్వామ్యానికి చాలా మౌలికమైన పునాదులని పవన్ సభలో అన్నారు.ఎంత జటిలమైన సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. సభ హుందాతనాన్ని కాపాడి, భవిష్యత్ తరాలకు ప్రామాణికంగా నిలపాలి అని చెప్పారు. ఈ ఐదేళ్ల ప్రజాప్రస్థానంలో రాబోయే తరానికి గొప్ప భవిష్యత్తునిచ్చేలా, రైతులకు అండగా ఉండేలా, మహిళలకు భద్రతతోపాటు ఉన్నతస్థాయికి ఎదిగేలా, ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించేలా, సర్వజనులందరికీ అభివృద్ది చేకూరేలా చర్చలు సాగాలని కోరుకుంటున్నాని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.