విధాత: ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో భిక్షమయ్య గౌడ్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా భిక్షమయ్య గౌడ్కు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీ ఒక దుష్ట సంస్కృతికి తెర తీసిందని, అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నదన్నారు. నల్లగొండ రాజకీయాన్ని ధనబలంతో, మునుగోడులో ధనబలంతో గెలవాలని ప్రయత్నిస్తున్నదని, చిత్తశుద్ధితో సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నామన్నారు.
ఆరు దశాబ్దాలుగా కాని పనిని నాలుగేండ్లలో చేసి చూపెట్టామని, ఆడబిడ్డలకు నీటి కష్టాలు లేకుండా చేశామని, రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన దిశగా దండుమల్కాపూర్లో పారిశ్రామిక సమూహాన్ని ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.
మీ రాకతో మరింత బలంతో, ఉత్సాహంతో ముందుకు పోతామని, వ్యవస్థలన్నీ దుర్వినియోగం చేస్తున్న విషయం మనకు కనబడుతుందన్నారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని, శిఖండి రాజకీయం చేస్తోందన్నారు. కానీ నల్లగొండ బిడ్డలు చైతన్యవంతులని సాగర్, హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారన్నారు.
ఈసారి కూడా మునుగోడులో కూడా అదే తీర్పు పునరావృతం అవుతుందని, జైలుకు వెళ్లొచ్చిన బిడ్డ కూసుకుంట్ల అని అలాంటి నాయకుడిని ప్రజలు గుండెలకు హత్తుకుంటారన్న నమ్మకం ఉందన్నారు. ఈ ఎన్నిక తెలంగాణ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపనుందని, ప్రజలు చైతన్యంతో కూడిన తీర్పును ఇవ్వాలన్నారు. తప్పకుండా బీజేపీకి బుద్ధి చెప్పాలని, తిరుగులేని తీర్పును ఇవ్వాలని అన్నారు.