Hemant Soren : : జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపై సొరేన్ అసెంబ్లీ విశ్వాసాన్ని పొందారు. ఆయన ప్రభుత్వానికి మద్దతుగా 47 మంది సంకీర్ణ కూటమి సభ్యులు నిలువగా, ప్రతిపక్షాలకు చెందిన 29 మంది వ్యతిరేకంగా ఓటేశారు. చంపై సొరేన్ విశ్వాస తీర్మానంలో విజయం సాధించినట్టు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రకటించారు. చంపై సభ విశ్వాసం పొందడంతో సభ్యులు బల్లలు చరిచి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అనంతరం సభను మరుసటిరోజుకు వాయిదా వేశారు.
మ్యాజిక్ ఫిగర్ 41
81 మంది సభ్యులు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 41 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే.. ఓటింగ్కు ముందు చంపై సొరేన్ మాట్లాడుతూ జేఎంఎంకు 47 మంది సభ్యుల మద్దతు ఉన్నదని, ఓటింగ్ సమయంలో ఇది 50కి కూడా పెరగవచ్చని వ్యాఖ్యానించారు.
ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర
చంపై సొరేన్ విశ్వాస తీర్మానం కోసం సోమవారం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చారు. ఈ సందర్భంగా విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి సొరేన్.. బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిపర్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని మండిపడ్డారు. చేయని నేరానికి మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ను ఇరికించారని విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని తప్పుడు కేసులో హేమంత్ సొరేన్ను అరెస్టు చేయించారని ఆరోపించారు. తన ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ పాలనకు ద్వితీయ భాగమని చెప్పారు.
రుజువు చేస్తే రాజకీయాలు వదిలేస్తా
ఈడీ కస్టడీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కూడా పీఎంఎల్ఏ కోర్టు అనుమతితో సోమవారం నాటి విశ్వాస పరీక్షకు హాజరయ్యారు. విశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా హేమంత్ మాట్లాడుతూ.. భూముల కుంభకోణంలో తన పాత్రను రుజువు చేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కారుకు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఆయన సవాలు విసిరారు. ‘వారు కనుక నిరూపించగలిగితే.. నేను రాజకీయ వదిలేస్తాను’ అని ప్రకటించారు.