ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ మారుతీ సుజుకీ. కంపెనీకి చెందిన స్విఫ్ట్ మోడల్ కార్లకు భారత్లో మంచి డిమాండ్ ఉన్నది. డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని కొత్త జనరేషన్ స్విఫ్ట్ కారును మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇటీవల జపాన్లో జరిగిన మొబిలిటీ షోలో కొత్త మోడల్ను పరిచయం చేసింది. ప్రస్తుతం టెస్ట్ రన్ దశలో ఉండగా.. వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది.
కొత్తగా రాబోయే స్విఫ్ట్ డిజైన్లో పెద్దగా కంపెనీ మార్పులేమి చేయలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న డిజైన్ కొనసాగనుండగా.. పలు అప్డేట్స్ తీసుకువచ్చింది. గ్రిల్, ఇంటిగ్రేటెడ్ ఎల్ షేప్ డీఆర్ఎల్స్తో కూడిన హెడ్లైట్స్తో కారు రానున్నది. కొత్త మోడల్ స్విఫ్ట్ మినీ కూపర్ను పోలి ఉన్నట్లు కనిపిస్తున్నది. అలాగే కొత్త మోడల్లో అలాయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్ల్యాంప్స్, ట్వీక్డ్ బంపర్తో రానున్నది. దాంతో కొత్త స్విఫ్ట్ మరింత మోడ్రన్గా, స్పోర్టీ లుక్లో కనిపించబోతున్నది.
ఇక ఇంటరీరియర్ విషయానికి వస్తే ఇందులో 9 ఇంచెస్ టస్స్ర్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ ఫోన్ చార్జర్ రానున్నట్లు తెలుస్తున్నది. అలాగే బ్లైండ్స్పాట్ మానిటరింగ్ వంటి ఏడీఏఎస్ ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తున్నది. మరో వైపు ఈ కొత్త మోడల్లో సరికొత్తగా 1.2 లీటర్ జెడ్ సిరీస్, 3 సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉండనున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
ప్రస్తుతం ఉన్న మోడల్లో 4 సిలిండర్ ఇంజిన్తో వస్తున్నది. ఇక కొత్త మోడల్ వచ్చే ఏడాది భారత్లో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ మోడల్ కారు ఎక్స్షోరూం ధర రూ.5.99లక్షలు. కొత్త మోడల్ ఈ ధరకన్నా ఎక్కువగానే ఉండవచ్చని తెలుస్తున్నది. కొత్త కారు హ్యుందాయ్ గ్రాండ్ నియోస్, టాటా పంచ్ తదితర కార్లకు పోటీ ఇచ్చే అవకాశం ఉన్నదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.