– జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచేడ్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగింది.
గద్వాలలో పుట్టిన రోజు వేడుకలకు వచ్చి తిరుగు ప్రయాణంలో కారులో వెళ్తున్న సమయంలో డ్రైవర్ ఓవర్ స్పీడ్ కారణంగా డివైడర్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో అందులో ఉన్న ఆరుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో మల్దకల్ గ్రామానికి చెందిన నరేష్ (23), పెబ్బేరుకు చెందిన పవన్ కుమార్ (28), గద్వాలకు చెందిన ఆంజనేయులు (50) ఘటనాస్థలంలోనే మృతి చెందారు. గాయపడిన నవీన్, గోవర్ధన్, మహబూబ్ పరిస్థితి విషమంగా ఉండడంతో గద్వాల ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.