విధాత: తమిళనాడులో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ బస్సు, ఓమ్నిబస్సు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 60 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రెండు వాహనాల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దాదాపు పది అంబులెన్స్లలో క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించారు. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఎదురు వస్తున్న ఓమ్నిబస్సును ఢీ కొట్టినట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు పోలీసులు వెల్లడించారు.
బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్తున్న స్టేట్ ఎక్స్ప్రెస్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు.. చెన్నైనుంచి బెంగళూరు వెళ్తున్న ఓమ్నిబస్సును చెట్టియప్పనూర్ వద్ద ఢీకొనడంతో ఒక మహిళతో సహా ఐదుగురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో రెండు వాహనాల డ్రైవర్లతోపాటు ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి ప్రభుత్వ దవాఖానలో, వేలూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానలో చేర్పించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.