విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన హాలియా మండలం వెంకటాపురంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ఆరెగూడెంకు చెందిన మధు నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్(ఎస్పీఎఫ్) గా పని చేస్తున్నారు. మధు మోటార్ సైకిల్పై నల్లగొండ వెళ్తుండగా, బైక్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంతో ఆరెగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.