అమ్మాయిలు కోరికలు అణుచుకోవాలన్న వ్యాఖల్యపై సుప్రీం మండిపాటు

కలకత్తా హైకోర్టు మైనర్ బాలికపై అత్యాచారం కేసు విచారణ సందర్భంగా కౌమర దశలో ఉన్న అమ్మాయిలు తమ లైంగిక వాంఛలను అణచుకోవాలంటూ

  • Publish Date - January 5, 2024 / 01:58 PM IST

విధాత : కలకత్తా హైకోర్టు మైనర్ బాలికపై అత్యాచారం కేసు విచారణ సందర్భంగా కౌమర దశలో ఉన్న అమ్మాయిలు తమ లైంగిక వాంఛలను అణచుకోవాలంటూ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గౌరవ హోదాలో ఉన్న న్యాయవాదులు ఇలాంటి తీర్పులలో తమ సొంత అభిప్రాయాలను చొప్పించడం సబబు కాదని సూచించింది. తీర్పులోని ప్రతి కాపీ అభ్యంతరకరంగా ఉన్నాయని, ఇలాంటి తీర్పులు రాయడం తీవ్రమైన తప్పిదమని పేర్కొన్నది. ఈ తీర్పు రాసిన న్యాయవాదులు కీలకమైన న్యాయ సూత్రాలను పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించింది. ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 12న జరుగనున్నది.


ఇక విషయంలోకి వెళితే పశ్చిమబెంగాల్‌లో ఓ యువకుడు 14 ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. దాంతో నిందితుడు ట్రయల్‌ కోర్టు తీర్పును కలకత్తా హైకోర్టులో అప్పీల్‌ చేశాడు. గత ఏడాది అక్టోబర్‌లో ఈ కేసులో జస్టిస్‌ చిత్తరంజన్‌ దాస్‌, జస్టిస్‌ పార్థసారథి సేన్‌ల నేతృత్వంలోని హైకోర్టు డివిజన్‌ బెంచ్ తీర్పునిస్తూ కౌమార దశలో ఉన్న బాలికలు తమ లైంగిక వాంఛలను అదుపులో పెట్టుకోవాలని వ్యాఖ్యానించింది.


ఆ రెండు నిమిషాల సుఖం కోసం బాలికలు తప్పుచేయకూడదని ఉచిత సలహా ఇచ్చింది. అంతేగాక నిందితుడికి ట్రయల్‌ కోర్టు విధించిన 20 ఏళ్ల జైలుశిక్షను రద్దు చేసింది. ఈ కేసు తీర్పును సుప్రీం కోర్టు గత డిసెంబర్ 8న సుమోటోగా స్వీకరించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేసే ఉద్దేశం ఉందా లేదా అని పశ్చిమబెంగాల్‌ సర్కారుకు నోటీసులు జారీ చేయగా, బెంగాల్ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆ పిటిషన్‌పై విచారణకు స్వీకరించి, పైవిధంగా హైకోర్టు తీర్పుపై తన అభ్యంతరాన్ని వెల్లడించింది.