Balkampet Yellamma : బల్కంపేటలో ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఆలయ అర్చకులు అమ్మవారిని 27 చీరలతో, స్వామివారిని 11 పంచెలతో అలంకరించారు. ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని కనులారా చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిచ్చారు. తెల్లవారుజాము నుంచే పలువురు భక్తులు కుటుంబసమేతంగా ఆలయం వద్దకు చేరుకున్నారు.
ఈ వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయాన్నే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి కల్యాణ ఉత్సవం వైభవంగా సాగుతోందని, ఆలయంలో కల్యాణ ఏర్పాట్లు చాలా బాగున్నాయని అధికారులను ఆయన అభినందించారు.
ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు, అనారోగ్యాలు లేకుండా చూడాలని ఎల్లమ్మ తల్లికి తాను మొక్కుకున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పంటలు బాగా పండి ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరపున కూడా బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి రూ.4.5 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు. త్వరలో ఆ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.