Site icon vidhaatha

నీట్ కౌన్సిలింగ్ వాయిదా, త్వరలోనే కొత్త తేదీలు … సుప్రీం వాయిదా వద్దన్న ఎన్టీఏ నిర్ణయం

విధాత, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల భర్తీ కోసం శనివారం నుంచి చేపట్టాల్సిన నీట్ కౌన్సిలింగ్‌ను ఎన్టీఏ వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నీట్ కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లుగా పేర్కోంది. కొత్త తేదీలను కేంద్ర విద్యాశాఖ త్వరలోనే ప్రకటిస్తుందని తెలిపింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం దేశ వ్యాప్తంగా రచ్చకు దారితీయగా, సుప్రీం కోర్టులో కేసు సైతం నడుస్తుంది. ఈ క్రమంలో నీట్ కౌన్సిలింగ్ వాయిదా వేయడంతో ఈ వివాదం మరో మలుపు తీసుకుంది. నీట్ కౌన్సెలింగ్ వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నీట్‌ పరీక్ష పేపర్ లీక్ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నీట్ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీం కోర్టులో దాదాపు 26 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం.. కౌన్సెలింగ్ వాయిదా వేయాలన్న పిటిషనర్ల అభ్యర్థులను తోసిపుచ్చింది. మరోవైపు, సుప్రీం ఆదేశాల మేరకు ఇటీవల గ్రేస్ మార్కులు కలిపిన విద్యార్థులకు మళ్లీ పరీక్షనిర్వహించి సవరించిన నీట్ ర్యాంకుల జాబితాను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ క్రమంలోనే అక్రమాల ఆరోపణలపై కేంద్రం, ఎన్డీఏ శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానానికి ఆఫిడవిట్లు సమర్పించాయి. నీట్- యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయతీ కలిగిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని కేంద్రం సుప్రీంకోర్టు కు తెలిపింది. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు రుజువులు లేనప్పుడు ఆ చర్య చేపట్టడం హేతుబద్ధం కాదని స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై జులై 8న తదుపరి విచారణ జరగనుంది. ఈ పరిణామాల మధ్య సుప్రీం అభిప్రాయలకు భిన్నంగా కౌన్సెలింగ్‌ వాయిదా వేయడం గమనార్హం.

Exit mobile version