Vijay Devarakonda | టాలీవుడ్లో ఒకప్పుడు యూత్ను ఊపేసిన హీరోగా నిలిచిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం తన కెరీర్లో కీలక దశను ఎదుర్కొంటున్నాడు. ‘అర్జున్ రెడ్డి’తో ఒక్కసారిగా స్టార్డమ్ అందుకున్న విజయ్, ఆ తర్వాత విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను నిర్మించుకున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వకపోవడంతో, విజయ్ మార్కెట్పై చర్చలు మొదలయ్యాయి. ఇటీవల విడుదలైన ‘కింగ్డమ్’ కూడా భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో అభిమానుల్లో కొంత నిరాశ కనిపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో విజయ్ నుంచి ఒక బలమైన కమ్బ్యాక్ అవసరమన్న మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అటువంటి సమయంలో దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్తో కలిసి చేస్తున్న ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్) ప్రాజెక్ట్పై అందరి దృష్టి పడింది. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన ‘టాక్సీవాలా’ సినిమా మంచి విజయం సాధించి, విజయ్ కెరీర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోడీ మరోసారి కలిసి పని చేయడంతో సహజంగానే అంచనాలు భారీగా పెరిగాయి. అంతేకాదు, మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుండటం ప్రాజెక్ట్కు మరింత బలం చేకూరుస్తోంది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం, ‘వీడీ 14’ ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా. బ్రిటీష్ పాలన కాలం నాటి నేపథ్యంతో సాగే ఈ కథలో విజయ్ ఇప్పటివరకు ఎప్పుడూ చూడని కొత్త లుక్, కొత్త ఎమోషనల్ షేడ్స్లో కనిపించనున్నాడట. రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను కేవలం కమర్షియల్ ఫార్ములాతో కాకుండా, కంటెంట్కు పెద్దపీట వేస్తూ తెరకెక్కిస్తున్నారని టాక్. అందుకే ఇది విజయ్ కెరీర్లో ఒక కీలక మైలురాయిగా మారే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. హీరోయిన్గా రష్మిక మందాన్న నటిస్తుండటం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో విజయ్ అభిమానుల హడావుడి మరో లెవెల్కు చేరింది. వరుసగా ఫ్లాపులు రావడంతో తమ హీరోకు ఈసారి తప్పకుండా సాలిడ్ హిట్ రావాలంటూ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ను అభిమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో యశ్వంత్ అనే ఓ ఫ్యాన్ చేసిన భావోద్వేగ మెసేజ్కు రాహుల్ స్పందిస్తూ, “రౌడీ ఫ్యాన్స్ అందరి ఆకలి తీరేలా వీడీ 14 ఉంటుంది” అని చెప్పడం ఇప్పుడు వైరల్గా మారింది. ఈ ఒక్క మాటతోనే అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
