Mahesh Babu’s Varanasi Release Locked for Summer 2027: Rajamouli Unveils Massive GlobeTrotter Surprises
- “వారణాసి” టైటిల్ రివీల్… మహేష్ బాబు రుద్ర లుక్తో సోషల్ మీడియాలో సంచలనం
(విధాత వినోదం డెస్క్)
హైదరాబాద్:
SSMB29 – Varanasi Movie | సూపర్స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్వరల్డ్ ప్రాజెక్ట్కు అధికారికంగా ‘వారణాసి’ అనే టైటిల్ను టీమ్ ప్రకటించింది. భూమ్మీద తొలినగరంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రం, దేవతల నివాసం, విశ్వనాథ నివాసం కాశీ.. ఆ వారణాసినే కథావస్తువుగా ఎంచుకుని రాజమౌళి మలచిన విశ్వచిత్రం వారణాసి. పురాణేతిహాసాల సమాహారంగా చిత్రాన్ని మలుస్తున్నట్లు టైటిల్ గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది.
హైదరాబాద్లో నిర్వహించిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ వీడియో ప్రేక్షకుల్లో మెరుపుగా పాకింది. 3 నిమిషాల 40 సెకన్ల నిడివి గల ఈ విజువల్ ప్రెజెంటేషన్లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా అద్భుతమైన గ్రాఫిక్స్, పురాణ నేపథ్యం, యుగాల మధ్య ప్రయాణం వంటి అంశాలను రాజమౌళి అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. వీడియో చివర్లో మహేష్ బాబు నందిపై సవారీ చేస్తూ, చేతిలో త్రిశూలంతో, మెడలో నంది లాకెట్తో కనిపించిన క్షణమే సోషల్ మీడియా మొత్తం వైబ్రేషన్స్తో నిండిపోయింది. ఈ ప్రత్యేక లుక్ను చూసి ప్రేక్షకులు “రుద్రుడిగా మహేశ్… ఇక ఓ కొత్త అధ్యాయం మొదలు” అంటూ సంబరాలు చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఎత్తున జరిగిన ఈ ఈవెంట్లో నటీనటుల పరిచయాలు, కథకు సంబంధించిన పలు క్లూస్ కూడా ఇచ్చారు. ఊహించినట్లే చిత్రం పేరు వారణాసి. గత కొన్ని రోజులుగా సోషల్మీడియాలో నలుగుతున్న రెండు పేర్లలో ఒకటి ఇదే.
ALSO READ : మహేశ్ – రాజమౌళి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ టైటిల్ – ఈ రెండింటిలో ఒకటి!
ఈ ఈవెంట్లో సంగీత దర్శకుడు కీరవాణి తనదైన స్టైల్లో మాట్లాడుతూ అనుకోకుండా ఒక కీలక సమాచారం బయటపెట్టారు. “ఇది 2027 సమ్మర్లో మీ ముందుకు రాబోతుంది” అంటూ ఆయన ఇచ్చిన హింట్తో సినిమా రిలీజ్ ప్లాన్ స్పష్టమైంది. మహేష్ బాబు అభిమానుల గుండెల్లో ‘ఫ్లాట్ కొనుగోలు చేశాను’ అనే పోకిరి స్టైల్ డైలాగ్ను కూడా కీరవాణి పవర్ఫుల్ టోన్లో చెప్తూ ప్రేక్షకులను అలరించారు.
శ్రీరామచంద్రుడిగా మహేశ్ బాబు – రాజమౌళి భావోద్వేగం
మరోవైపు దర్శకుడు రాజమౌళి ఈ చిత్రానికి సంబంధించి తన భావోద్వేగ ప్రయాణాన్ని పంచుకుంటూ,మహేశ్ బాబును రాముడి పాత్రలో మొదటిసారి చూసినప్పుడు తన రోమాలు నిక్కబొడుచుకున్నాయని తెలిపారు. “రామాయణంలోని ఒక ముఖ్య ఘట్టం మా కథకు ఆధారం. మాటల్లో చెప్పలేనంత భారీ స్థాయి భావోద్వేగాన్ని ఈ వీడియో తెలియజేస్తుంది” అని వివరించారు.దీన్ని బట్టి మహేశ్బాబు కాసేపు రాముడిగా కూడా కనిపించబోతున్నారన్న విషయం స్పష్టమైంది. మొట్టమొదటిసారి సూపర్స్టార్ మహేశ్ ఒక పౌరాణిక పాత్రలో నటించడం విశేషం. ట్రైలర్ విడుదల సమయంలో వచ్చిన సాంకేతిక సమస్యను ప్రస్తావిస్తూ ఆయన భావోద్వేగానికి గురైన తీరు ప్రేక్షకులను కదిలించింది.
ALSO READ :టాంజానియా అడవుల్లో మహేశ్ బాబు మూవీ ఎస్ఎస్ఎంబీ 29
ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ శక్తివంతమైన పాత్రలు… రేంజ్ పెంచిన క్యాస్టింగ్
వారణాసి చిత్రంలో ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రలో కనిపించనుండగా, ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే వైరల్ అయింది. సాంప్రదాయ చీరలో గన్ పట్టుకుని ఉన్న ఆమె యాక్షన్ అటిట్యూడ్ అభిమానుల్లో ఆసక్తిని రగిలించింది. మరోవైపు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన లుక్పై వచ్చిన మీమ్స్, ట్రోల్స్ సినిమా మీదున్న భారీ అంచనాలను మరింత పెంచాయి.
అదేవిధంగా ఈ చిత్రాన్ని ఒరిజినల్ ఐమ్యాక్స్ ఫుల్-స్క్రీన్ ఫార్మాట్లో షూట్ చేస్తున్నామని రాజమౌళి ప్రకటించడం విశేషం. హాలీవుడ్ స్థాయి విజువల్స్ అందించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను పరిచయం చేస్తున్నామని చెప్పారు.
మొత్తానికి మహాభారతం తన కల అని చెప్పిన దర్శకధీరుడు, ముందుగా రామాయణ ఘట్టాలను చిత్రీకరిస్తానని ఊహించలేదు. అసలు రాముడికి, వారణాసికి సంబంధమేమిటో, ఆకాశం నుండి రాలిపడిన గ్రహశకలం శాంభవి, ఎద్దుపై స్వారీ చేస్తూ, త్రిశూలంతో కనిపించిన కథానాయకుడు రుద్ర, యుగాల మధ్య సంబంధాన్ని చూపుతూ సాగిన ఈ గ్లింప్స్ ఆద్యంతం కట్టిపడేసింది. ఎక్కడా ఒక్క డైలాగ్ లేకుండా, కేవలం బిజీఎంతో, విజువల్ వండర్లా ఐమ్యాక్స్ ఫార్మాట్లో ప్రదర్శించిన ఈ 3 నిముషాల వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో ట్రెండ్సెట్టర్ అయింది.
ఇదే ఆ టైటిల్ గ్లింప్స్:
