Health tips : మామిడి పండ్లు అతిగా తింటే వేడి చేస్తుందని అంటారు. అంతేగాక కొందరు మామిడి పండ్లతో బరువు పెరుగుతారని భయపెడతారు. అయితే వేడి చేయడం సంగతి కొంతమేరకు నిజమే అయినా బరువు పెరుగడానికి, మామిడి పండుకు మాత్రం ఎలాంటి సంబంధం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మామిడి పండులో కొలెస్టరాల్గానీ, ఉప్పుగానీ ఉండవని అంటున్నారు. అంతేగాక వేసవిలో శరీరానికి సరైన పోషకాలను అందించే పండు మామిడి పండేనని కితాబిస్తున్నారు. మరి మామిడి పండుతో కలిగే ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
ప్రయోజనాలు..
- మామిడి పండు తినడంవల్ల నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దాంతో పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి. దంతాలు శుభ్రపడుతాయి. పంటిపై ఎనామిల్ కూడా దృఢంగా మారుతుంది.
- మామిడి పండు మంచి జీర్ణకారి. ఇది అజీర్ణం, అరుగుదల సరిగా లేకపోవడం లాంటి జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది.
- మామిడి పండ్లలో ఐరన్ సమృద్దిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారు మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
- మామిడి పండులో ఉండే కాపర్ ఎర్రరక్త కణాల వృద్దికి దోహదపడుతుంది. ఈ పండులో వుండే విటమిన్లు, ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.
- చర్మము ఆరోగ్యాన్ని పెంచడానికి మామిడిపండ్లు తోడ్పడుతాయి. మెదడు ఆరోగ్యానికి కూడా మామిడి పండ్లు బాగా పనిచేస్తాయి.
- మామిడి పండ్లలో మరో గొప్ప లక్షణం కూడా ఉన్నది. శృంగారంపై ఆసక్తి కోల్పోయిన వారిలో శృంగార వాంఛ రేకెత్తించడంలో కూడా మామిడి పండు బాగా ఉపయోగపడుతుంది.
- అదేవిధంగా మామిడిపండులో బిటా కెరోటిన్ అనే పదార్థం సమృద్దిగా ఉంటుంది. ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని బలోపేతం చేస్తుంది.