Warangal Comprehensive Development: Minister Ponguleti Orders Fast-Track Works
- త్వరలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం
- అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్దాపన
- యుద్ధ ప్రాతిపదికన అభివృద్ది పనులు
విధాత ప్రత్యేక ప్రతినిధి – వరంగల్:
వరంగల్ నగర సమగ్రాభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నందున ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగాపని చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
మంగళవారం సచివాలయంలో వరంగల్ జిల్లా అభివృద్దిపై దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి ధీటుగా వరంగల్ నగర అభివృద్దిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. వరంగల్ నగర అభివృద్దికి తీసుకుంటున్న నిర్ణయాల అమలులో వేగం పెంచాలని సూచించారు. జిల్లాలో చేపట్టిన వివిధ ప్రగతి పనులు వచ్చే జూన్ 2వ తేదీ కల్లా పూర్తి కావాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు నిర్విరామంగా పనిచేయాలని సూచించారు.
జూన్ నాటికి అందుబాటులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పూర్తి చేసి జూన్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి పొంగులేటి సూచించారు
భద్రకాళి ఆలయ అభివృద్ది పనులు, భధ్రకాళి చెరువు డీ సిల్టేషన్ అంశాలకు సంబంధించి ఆలయ మాడవీధులలో కృష్ణశిలతో నిర్మాణం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రకాళి చెరువు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఇన్ ఫాల్, అవుట్ ఫాల్ విషయంలో భూ సేకరణను వేగవంతం చేయాలన్నారు.గత ప్రభుత్వం ఆర్బాటంగా శంకుస్ధాపన చేసి గాలికి వదిలేసిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను పూర్తి చేశామని జూన్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు, ఆసుపత్రి సామగ్రి ఏర్పాటు, డాక్టర్ల నుంచి మొత్తం సిబ్బంది నియామకానికి సత్వరమే కార్యాచరణను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డుకు అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూసేకరణను వేగవంతం చేయాలన్నారు.
త్వరలో భూ గర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం
నగరంలో భూగర్భ మురుగు కాలువల పైపులైన్ నిర్మాణ పనుల దృశ్యం.
వరంగల్ పట్టణంలో 5,257 కోట్ల రూపాయలతో చేపట్టే భూ గర్భ డ్రైనేజీ పనులకు సంబంధించి వెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి వచ్చేనెలలో పనులను ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
అసంపూర్తిగా ఉన్న 2 బిహెచ్కే ఇండ్లకు ఈనెల 31లోగా లబ్దిదారులను ఎంపిక చేసి కేటాయించాలని సూచించారు. 2బిహెచ్కే కాలనీల్లో కరెంట్, డ్రైనేజ్, తాగునీరు, రోడ్లు వంటి కనీస సౌకర్యాలను ఆనాటి ప్రభుత్వం విస్మరించిందని తక్షణమే ఆయా కాలనీల్లో కనీస వసతుల ఏర్పాటు చేయాలని ఇందుకు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు పంపిస్తే నిధుల మంజూరు చేస్తానని తెలిపారు.
ఈ సమావేశంలో శాసనసభ్యులు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కె ఆర్ నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హన్మకొండ కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, చాహాత్ బాజ్ పాయి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
