ఇటీవల వచ్చిన భారీ భూకంపంతో జపాన్ (Japan Earth Quake) వణికిపోయిన విషయం తెలిసిందే. ఈ విపత్తు బారిన పడి కనీసం 126 మంది మరణించగా.. వేల మంది నిరాశ్రయులయ్యారు. భారీ ఆస్తి నష్టం సైతం సంభవించింది. భూకంపం సంభవించి అయిదు రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో దేశ పశ్చిమ భాగంలోని సుజు నగరంలో భవన శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న 90 ఏళ్ల బామ్మను సిబ్బంది రక్షించారు. ఈ ఘటన స్థానికంగా అందరినీ ఆకర్షిస్తోంది. సాధారణంగా భూకంపం వంటి విపత్తుల్లో శిథిలాల కింద చిక్కుకున్న వారు 72 గంటల వరకే జీవించి ఉండేందుకు అవకాశంది. కానీ జపాన్లో భూకంపం వచ్చి ఆ బామ్మ బయటపడే సమయానికి 152 గంటలు గడిచింది.
ఈ వయసులో ఆ స్థితిలో ప్రాణాలు కాపాడుకోవడం అద్భుతమేనని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. శిథిలాలను వెలికితీస్తున్న సిబ్బందిని చూసి వారితో వచ్చిన కుక్క పదేపదే మొరగడంతో బామ్మ ఉన్న చోట వారి దృష్టిపడింది. ఏంటా అని వెలికితీయగా వారికి ఆమె కనిపించింది. మా దగ్గర ఉన్న కుక్కలకు ప్రాణాలతో ఉన్న వారి వాసన చూసేలా శిక్షణ ఇస్తాం. ఇది హైడ్ అండ్ సీక్ ఆటలా ఉంటుంది అని ఆ శునకం శిక్షకుడు మసాయో కుకుచీ వెల్లడించారు.
ఈ ఘటన జరిగిన ఇసాకావా రీజియన్లో 30 వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. 89వేల ఇళ్లకు ఇప్పటికీ కరెంట్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. వందల మంది నిరాశ్రయులు ప్రభుత్వ శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు. చాలా చోట్ల పైపులు పగిలిపోవడంతో నీటి సరఫరాకు మరింత సమయం పడుతుందని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. మరోవైపు ఇప్పటి వరకు 210 మంది ఆచూకీ తెలియడం లేదు. వీరు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. వారిని వెలికి తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.