విధాత: రష్యాలోని ఆర్మిజోన్స్కోయ్కు చెందిన 279 కిలో ఊబకాయుడు లియోనిడ్ ఆండ్రీవ్ (60) కన్నుమూశారు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి బరువు తగ్గడానికి ప్రయత్నించే క్రమంలో గుండెపోటుతో మరణించారు. ఆహార వ్యసనం ఆయనను ఊబకాయుడిగా మార్చింది. ఐదేండ్లుగా మంచానికే పరిమితం చేసింది. చివరికి ప్రాణాలను బలి తీసుకున్నది.
లియోనిడ్ ఆండ్రీవ్ యవ్వనంలో అందరిలాగే సాధారణంగా ఉండేవారు. 69 కిలోల బరువుతో మంచి అథ్లెట్గా రాణించారు. వ్యవసాయం చేశారు. పంటలు పండించారు. ఆహార ప్రియుడైన ఆయన నోరుకాచేవారు కాదు. బన్నులు, ఆలుగడ్డ ఫ్రైలు ఇష్టంగా తినేవారు. బ్రెడ్ బాగా లాగేంచేవారు. ఎంత తింటున్నారో కూడా తెలిసేది కాదు. క్రమంగా బరువు పెరగసాగారు. ఐదేండ్ల వ్యవధిలోనే నాలుగు గున్న ఏనుగులంతా 279.413 కిలోల (616 పౌండ్లు) బరువు పెరిగారు. ఇలా బరువు పెరుగుతూ పోతే ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు ఆయనను హెచ్చరించారు. తక్షణమే బరువు తగ్గాలని సూచించారు.
వైద్యుల సూచన మేరకు లియోనిడ్ ఆండ్రీవ్ బరువు తగ్గే ప్రయత్నాలు ప్రారంభించారు. తక్కువ తినడం, పిండి ఉత్పత్తులను నివారించడం మొదలు పెట్టారు. కానీ, ఆయన ఊబకాయం వల్ల కలిగే నష్టాన్ని తిప్పికొట్టడానికి చాలా ఆలస్యం కావడంతో చివరికి శుక్రవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. నగరానికి వెళ్లి అపార్ట్మెంట్లో జీవించాలనే తన చిన్న కలను కూడా ఆయన నెరవేర్చుకోలేకపోయారు. ఆండ్రీవ్ తరహాలోనే అమెరికాకు చెందిన ఓ మహిళ కూడా ఆహార వ్యసనంతో బరువు పెరిగి ఊబకాయంతో 12 ఏండ్లు మంచానికే పరిమితమై చివరికి తుదిశ్వాస విడిచారు.