విధాత : సంగారెడ్డి రూరల్ పోలీస్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో 3కోట్ల విలువ చేసే 635 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్సీ చెన్నూరి రూపేష్ తెలిపారు. టాస్క్ ఫోర్స్ బృందాలు, సంగారెడ్డి రూరల్ సిబ్బంది కలిసి సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. రెండు బొలెరో వాహనాలను సీజ్ చేసి, ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ను అదుపులోకి తీసుకున్నట్లు మీడియాకు వివరించారు.
బొలెరో వాహనాల కింది భాగంలో బాక్సు్ లాంటి నిర్మాణం ఏర్పాటు చేసి గంజాయి తరలిస్తున్నారని తెలిపారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన తమ యజమాలు హనుమాన్ మోహిత్, సమీర్ గవండేల ఆదేశం మేరకు ఒడిశాలోని జన్ బాయ్ ఏజెన్సీ ప్రాంతంలో ఉండే త్రినాధ్ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు రవాణా చేస్తున్నట్లు వివరించారు. టాస్క్ పోర్స్ అధికారుల సమాచారం మేరకు వాహనాల తనిఖీ నిర్వహించి గంజాయిని సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. తనిఖీల్లో పాల్గొన్న ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్, కానిస్టేబుళ్లు ఇస్మాయిల్, శంకర్ తదితరులను ఎస్పీ అభినందించారు.