Yadadri | మహిమాన్వితం యాదగిరి గుట్ట క్షేత్రం.. నరసింహస్వామి ఆలయం చరిత్ర-విశేషాలు

యాద‌రుషి త‌పోఫ‌లంతో యాద‌గిరిగుట్ట‌గా ప్ర‌సిద్ధి పాంచ‌న‌ర‌సింహుడిగా కొలువైనా ల‌క్ష్మీన‌ర‌సింహుడు.. క్షేత్ర పాల‌కుడిగా పూజ‌లందుకుంటున్న ప్ర‌స‌న్నాంజ‌నేయుడువిధాత‌: యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహుడిగా భ‌క్తులకు ద‌ర్శ‌న‌మిచ్చే.. ఉగ్ర‌న‌ర‌సింహుడిగా భ‌క్తుల‌ను ప‌రిర‌క్షించే ఆ పాంచ‌న‌ర‌సింహుడు కొలువైన యాదాద్రి క్షేత్రం ఎంతో మ‌హిమాన్విత‌మైన‌ది. మ‌రి ఆ స్వామి కొండ‌పైకి ఎలా వ‌చ్చారు? ఎందుకు వ‌చ్చారు? ఆ గుట్ట యాద‌గిరిగుట్ట‌గా ఎలా ప్ర‌సిద్ధి చెందింది? అంత‌టి పుణ్య‌క్షేత్రమైన యాదాద్రి స్థ‌ల పురాణం గురించి తెలుసుకుందాం.. వ‌ర గ‌ర్వంతో హిర‌ణ్య‌క‌శ‌పుడు.. యాదగిరి పాంచనరసింహ క్షేత్ర పురాణాల్లో ఎన్నో ఐతిహ్యాలున్నాయి. […]

  • Publish Date - February 20, 2023 / 05:00 AM IST
  • యాద‌రుషి త‌పోఫ‌లంతో యాద‌గిరిగుట్ట‌గా ప్ర‌సిద్ధి
  • పాంచ‌న‌ర‌సింహుడిగా కొలువైనా ల‌క్ష్మీన‌ర‌సింహుడు..
  • క్షేత్ర పాల‌కుడిగా పూజ‌లందుకుంటున్న ప్ర‌స‌న్నాంజ‌నేయుడువిధాత‌: యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహుడిగా భ‌క్తులకు ద‌ర్శ‌న‌మిచ్చే.. ఉగ్ర‌న‌ర‌సింహుడిగా భ‌క్తుల‌ను ప‌రిర‌క్షించే ఆ పాంచ‌న‌ర‌సింహుడు కొలువైన యాదాద్రి క్షేత్రం ఎంతో మ‌హిమాన్విత‌మైన‌ది. మ‌రి ఆ స్వామి కొండ‌పైకి ఎలా వ‌చ్చారు? ఎందుకు వ‌చ్చారు? ఆ గుట్ట యాద‌గిరిగుట్ట‌గా ఎలా ప్ర‌సిద్ధి చెందింది? అంత‌టి పుణ్య‌క్షేత్రమైన యాదాద్రి స్థ‌ల పురాణం గురించి తెలుసుకుందాం..

వ‌ర గ‌ర్వంతో హిర‌ణ్య‌క‌శ‌పుడు..

యాదగిరి పాంచనరసింహ క్షేత్ర పురాణాల్లో ఎన్నో ఐతిహ్యాలున్నాయి. స్కాంద, నరసింహ పురాణాల మేరకు సప్త ఋషుల్లో ఒకరైన కశ్యపుడికి విష్ణుమూర్తి అనుగ్రహంతో హిరణ్యకశపుడు, హిరణ్యాక్షుడు జన్మిస్తారు. విష్ణుమూర్తి హిరణ్యాక్షుడిని వరాహవతారంతో సంహరించగా, తనకు విష్ణుమూర్తితో ముప్పు ఉందని భావించి ఘోర తపస్సుతో హిరణ్యకశిపుడు బ్రహ్మను ప్రసన్నం చేసుకుంటాడు. సురులు నరులు మృగాలు ఆయుధాల చేతను మరణం లేకుండా, ఇంటి లోపల వెలుపల పగలు రాత్రి నింగిలో నేలపైన నిప్పులో నీటిలోనూ దేనివల్ల మరణం రాకుండా వరం పొందుతాడు. వర గర్వంతో హిరణ్యకశపుడు దేవతలను, మునులను, విష్ణుభక్తులను హింసించడం సాగిస్తాడు.

YADADRI : నరసన్న పెళ్లికి ఏడుకొండ‌ల వెంకన్న ప‌ట్టు వస్త్రాలు

హరి భ‌క్తుడు ప్ర‌హ్లాదుడు

హిరణ్యకశ్యపుడికి జన్మించిన ప్రహ్లాదుడు చిన్ననాటి నుండి హరి నామస్మరణ సాగిస్తుంటాడు. ప్రహ్లాదుడి చేత హరినామ స్మరణ మాన్పించేందుకు హిరణ్యకశపుడు ఎంత ప్రయత్నించినా కొడుకు హరినామస్మరణ మానకపోవడంతో అనేకరకాలుగా అతడిని అంతమొందించాలని ప్రయత్నిస్తాడు . ప్రతిసారి ప్రహ్లాదుడు పునరుజ్జీవుడై తిరిగి రావడంతో పట్టలేని ఆగ్రహంతో ఎక్కడరా నీ హరి అంటూ ప్రశ్నిస్తాడు.

హిర‌ణ్య‌క‌శ్య‌పుడి సంహారం..

హరి ఇందుగలడందు లేడని సందేహము వలదు ఎందెందు వెతికినా అందందే కలడు అని ప్రహ్లాదుడు చెబుతాడు. అయితే నీ హరీ ఈ స్తంభంలో ఉన్నాడా అంటూ ప్రహ్లాదుడిని గద్దించగా ఉన్నాడంటూ ప్రహ్లాదుడు బదులిస్తాడు. హిరణ్య కశ్యపుడు స్తంభం పై గదతో మోదగా మహావిష్ణువు ఆకాశం బద్దలైనట్లు భూగోళం పేలిపోయినట్లు సముద్రాలు ఉప్పొంగినట్లు స్తంభాన్ని చీల్చుకుంటూ మహోగ్ర నరసింహుడి రూపంలో భీకర గర్జనలతో బయటకు వస్తాడు. హిరణ్య కశ్యపుడిని పట్టి తన తొడల మీద అదిమిపెట్టి గోళ్ళతో వక్షస్థలాన్ని చీల్చి పేగుల్ని మెడలో వేసుకుని సంహరిస్తాడు.

ఉగ్ర న‌ర‌సింహావ‌తారం ఉప‌సంహ‌ర‌ణ‌..

బ్రహ్మ వరం అనుసరించి నరుడు మృగము కానీ నరమృగ రూపంలో, పగలు రాత్రి కానీ సంధ్యా సమయంలో, ఇంటా బయట కాక గుమ్మం గడపపై భూమిపైన ఆకాశంలో గాక తన తొడ మీద హిరణ్య కశ్యపుడిని సంహరించిన అవతారమే నృసింహ అవతారం. కృతాయుగంలో హిరణ్యకశ్యపుడి వధ అనంతరం ఉగ్ర నరసింహావతారంలో భీతి గొలుపుతున్న లక్ష్మీనరసింహుడిని ఎల్లవేళలా ప్రసన్న రూపంలో దర్శనమివ్వమని ప్రహ్లాద సహిత దేవతలు ప్రార్థిస్తారు. రాక్షస వధ జరిగినచోట ప్రసన్న దర్శనం భావ్యం కాదంటూ దక్షిణభారతాన కొండపైన గుహలో లక్ష్మీ సహితంగా వెలసి జ్ఞాన నేత్రాలతో దర్శనమిస్తానని చెప్పి ఈ యాదగిరిగుట్టలో నరసింహుడు ప్రసన్న నేత్రాలతో వెలియగా బ్రహ్మాది దేవతలు వారిని పూజించి ఆరాధించారు.

Yadadri Brahmotsavam | బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ క్షేత్రం

యాద‌రుషిని ర‌క్షించిన ఆంజ‌నేయుడు..

త్రేతాయుగంలో విభాండక మహర్షి భార్య, శ్రీరామచంద్రుడి సోదరి అయిన శాంత పుత్రుడైన ఋష్య శృంగుడి కుమారుడైన యాదఋషి శ్రీమహావిష్ణువును హిరణ్యకశ్యపుడిని వధించిన ఉగ్ర నరసింహుడి రూపంలో దర్శనం ఇవ్వాలని కోరుతూ అన్వేషణకు బయలుదేరుతాడు. అడవుల్లో కొండ జాతికి చిక్కి ప్రాణాపాయంలో ఉన్న యాద రుషిని క్షేత్రపాలకుడు ఆంజనేయుడు రక్షించి యాదాద్రి కొండపై స్వామివారి సాక్షాత్కారానికి తపస్సు చేయమంటూ సూచిస్తాడు.

పాంచ‌న‌ర‌సింహుడిగా…

యాదఋషి ఘోర తపస్సుకి మెచ్చిన నరసింహుడు జ్వాల, జ్యోతి రూపంలో ప్రత్యక్షమవుతాడు. అతడి కోరిక మేరకు ఉగ్ర నరసింహ, జ్వాల, యోగానంద, గండబేరుండ, లక్ష్మీనరసింహులుగా దర్శనమిస్తాడు. కొండపైన గుహలో జ్వాల, యోగానంద, గండబేరుండ, లక్ష్మీనరసింహులుగా కొలువై భక్తులకు దర్శనమిస్తూ, కొండ చుట్టూ ఉగ్ర నరసింహుడుగా ఆవహించి భక్తులను పరిరక్షిస్తాడని క్షేత్ర ప్రసిద్ధి.

స్వామి తన ఆయుధం సుదర్శన చక్రాన్ని భక్తుల రక్షణకు ఇక్కడ నియమించాడని క్షేత్ర పురాణం. పంచ నరసింహులు అర్చా మూర్తిగా ఏకశిలపై వెలసిన యాదాద్రి క్షేత్రం పంచ నారసింహ క్షేత్రంగా భక్తుల పూజలు అందుకుంటుండగా క్షేత్రపాలకుడిగా ప్రసన్నాంజనేయుడు పూజ లందుకుంటున్నారు. కొండపై యాదఋషి స్వామి పాదాలు కడిగిన జలంతో ఏర్పడిన విష్ణు పుష్కరిణి భక్తుల పుణ్య స్నానాలకు వేదిక అయింది.

శివ‌కేశ‌వుల పుణ్య‌స్థ‌లంగా…

యాదాద్రిలో ప్రతిరోజు రాత్రి సురమునులు స్వామివారిని సేవిస్తారని భక్తుల నమ్మిక. యాదఋషి తపో ఫలంగా ఈ కొండ యాదగిరిగుట్టగా ప్రసిద్ధినొందింది. కృతాయుగం నుండి సురులు, మునులు, రాజాధిరాజులు సేవించిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ దర్శనంతో సకల కష్టాలు, భూత, ప్రేత, గ్రహ పీడ దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మహాదేవుడు శివుడు సైతం ఈ క్షేత్రంపై పర్వత వర్ధిని సహిత రామలింగేశ్వరుడుగా కొలువై ఉండటంతో శివకేశవుల పుణ్యస్థలిగా సైతం యాదాద్రి విరాజల్లుతుంది.

ఏడుపాయల జాతర: కన్నుల పండువగా బండ్ల ఊరేగింపు