పాక్‌లో మ‌రో ఉగ్ర‌వాది హ‌త్య‌.. కాల్చి పారిపోయిన గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు

పాక్‌ లో న‌క్కి ఉంటూ భార‌త్‌ (India) కు వ్య‌తిరేకంగా ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు నిర్వ‌హించే కీల‌క వ్య‌క్తుల హ‌త్య‌లు కొన‌సాగుతున్నాయి

  • Publish Date - December 6, 2023 / 10:51 AM IST

విధాత‌: పాక్‌ (Pakistan) లో న‌క్కి ఉంటూ భార‌త్‌ (India) కు వ్య‌తిరేకంగా ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు నిర్వ‌హించే కీల‌క వ్య‌క్తుల హ‌త్య‌లు కొన‌సాగుతున్నాయి. తాజాగా 26/11 ముంబ‌యి ఉగ్ర‌దాడుల‌కు సూత్ర‌ధారి హ‌ఫీజ్ స‌య‌ద్‌కు కీల‌క అనుచ‌రుడైన అద్నాన్ అహ్మ‌ద్ పాక్‌లోని క‌రాచీలో హ‌త్య‌కు గుర‌య్యాడు.


కాగా.. అత‌డు త‌న ఇంటి బ‌య‌ట ఉండ‌గా బండి మీద ఉన్న ఇద్ద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అద్నాన్ శ‌రీరంలో బుల్లెట్లు దింపి పారిపోయారు. స్థానికులు, పోలీసులు అత‌ణ్ని ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ప్ప‌టికీ.. అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు ధ్రువీక‌రించారు. కొన్ని వార్తా క‌థ‌నాల ప్ర‌కారం ఈ నెల 2 లేదా 3వ తేదీ అర్ధ‌రాత్రి ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.


ల‌ష్కరే తోయిబాకు రాజ‌కీయ విభాగ‌మైన మిల్లీ ముస్లిం లీగ్‌లో అద్నాన్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. 2015లో భార‌త బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌) కాన్వాయ్‌ను జ‌మ్మూ క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు పేల్చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు బీఎస్ఎఫ్ సైనికులు అమ‌రుల‌వ్వ‌గా.. మ‌రో ఎనిమిది మంది గాయ‌ప‌డ్డారు. ఈ ఘాతుకానికి అద్నాన్ ప్రణాళిక ర‌చించాడ‌ని భార‌త నిఘా వ‌ర్గాలు నిర్ధ‌రించాయి.


కాగా ఇటీవ‌ల భార‌త వ్య‌తిరేకుల‌ను ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్చి పారిపోతున్న ఘ‌ట‌న‌లు పాక్‌లో వ‌రుస‌గా జ‌రుగుతున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే అద్నాన్‌తో క‌లిపి 13 మంది ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయి.

Latest News