South Africa
విధాత: దక్షిణాఫ్రికాలో దారుణం జరిగింది. విషపూరిత గ్యాస్ లీక్ (toxic gas leaked) అయి ముగ్గురు చిన్నారులు సహా 16 మంది మృతువాతపడ్డారు. 24 మంది వరకు మరణించి ఉండవచ్చని అత్యవసర సేవలు తెలిపాయి. మృతుల సంఖ్య స్పష్టంగా తెలియరానప్పటికీ ప్రాణనష్టం ఎంత మేరకు జరిగిందనే విషయాన్ని గుర్తించేందుకు సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.
ఈ ఘటన జోహన్నెస్బర్గ్ తూర్పు శివార్లలోని బోక్స్బర్గ్ నగరంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్నదని పోలీసులు తెలిపారు. జోహన్నెస్బర్గ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బంగారు గనులు పుష్కలంగా ఉండటం వల్ల అక్రమ మైనింగ్ కార్యకలాపాలు అధికంగా జరుగుతుంటాయి. మైనర్లు తరచుగా మూసివేసిన, ఉపయోగించని గనుల్లోకి వెళ్లి బంగారం కోసం వెతుకుతారు. అక్రమంగా గ్యాస్ను వినియోగిస్తుంటారు. ఈక్రమంలో ప్రమాదాలు జరిగి చిన్నారులు మృతువాత పడుతుంటారు.
ఏంజెలో అనే మురికివాడలోని ఒక గుడిసెలో ఉంచిన గ్యాస్ సిలిండర్ నుంచి బుధవారం రాత్రి విషపూరిత గ్యాస్ లీక్ కావడం వల్లే మరణాలు సంభవించాయని అత్యవసర సేవల ప్రతినిధి విలియం తెలిపారు. గ్యాస్ లీక్ ఆగిపోయిందని, ఘటనా ప్రాంతంలో నుంచి ఎటూ 100 మీటర్ల వ్యాసార్థంలో మృతులు, అస్వస్థతకు గురైన వారి కోసం సహాయ బృందాలు వెతుకుతున్నాయని పేర్కొన్నారు.
ఆ ప్రాంతంలో మృతదేహాలు ఇప్పటికీ నేలపై పడి ఉన్నాయని చెప్పారు. ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్లు, పాథాలజిస్టులు గ్యాస్ లీక్ జరిగిన ప్రదేశానికి చేరుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. గత డిసెంబరులో బోక్స్బర్గ్ నగరలో పెట్రోలియం గ్యాస్తో వెళ్తున్న ట్రక్కు వంతెన కింద ఇరుక్కుపోయి పేలిపోవడంతో 41 మంది మరణించారు.