విధాత: ఖండాలు దాటినా కులం కంపు పోనిచ్చుకోలేదు.. దేశాలు దాటినా దరిద్రం వదిలించుకోలేదు. ఎంత చదివినా కులం జాడ్యం మాత్రం పోవడం లేదు.. కుగ్రామాల్లో పల్లెల్లో చదువులేనివాళ్ళు కులాన్నిబట్టి బంధాలు బంధుత్వాలు నడుపుతారన్నది నిజం కానీ అమెరికా పోయినా ఇదే చండాలం అవలంభిస్తూ తమ అనాగరికత్వాన్ని చూపించి పదిమంది నడుమా చులకన అయిపోయిన సంఘటన ఇది.
న్యూ ఇయర్ వేడుకలలో డల్లాస్ లో కమ్మ కాపు వివాదం రేగి ఒకరిని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు అన్న వార్తలు ఇపుడు సంచలనంగా మారాయి. తెలుగు వారు డల్లాస్ లో స్థిరపడి అన్ని విధాలుగా రాణిస్తున్నారు. వృత్తిపరంగా ఎంత ఎదిగినా వ్యక్తిత్వం పరంగా అంతగా దిగజారిపోతున్న ఈ ఫారిన్ బ్యాచ్ ను చూసి గ్రామాల్లోని నిరక్షరాస్యులు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి నెలకొంది
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తెలుగు ఎన్నారై అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన వేడుకలలో కమ్మ కాపు అంటూ రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. రిట్జ్-కార్ల్టన్ ప్రాంతంలో ఘనంగా నిర్వహించిన మ్యూజికల్ నైట్ లో అక్కడ నివసిస్తోన్న తెలుగు వారంతా తమ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.
ఇక ఇక్కడా చూస్తే మ్యూజికల్ నైట్ లో పాటల విషయంలో కొంత వివాదం నడచింది. కేవలం నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పాటలను మాత్రమే ఎంపిక చేసి మ్యూజికల్ నైట్ లో పాడాలని నందమూరి అభిమానులు పట్టుబట్టారు. దీనికి పవన్ కల్యాణ్ అభిమానులు ప్రతిఘటించారు.
ఇలా మొదలైన వివాదం కాస్తా మద్యం మత్తులో ఉన్న తెలుగుదేశం నాయకుడిగా చెప్పుకునె కేసీ చేకూరి పవన్ కల్యాణ్ అభిమానులపై దాడికి దిగినట్లు చెబుతున్నారు. దీన్ని పవన్ కల్యాణ్ అభిమానులు ప్రతిఘటించడంతో గొడవ చోటు చేసుకుంది. ఇక వ్యవహారం ఎంతదాకా వెళ్ళిందంటే అన్ స్టాపబుల్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వచ్చి బాలయ్య పక్కన చేతులు కట్టుకుని నిలబడ్డాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ మాటల దాడి చేశారట.
ఒకనాడు పవన్ కళ్యాణ్ సభలకు వచ్చే వారిని ఉద్దేశించి బాలయ్య అలగాజనం అని విమర్శించినా చివరికి పవన్ బాలయ్య షోకి వచ్చారని కూడా ఫ్లాష్ బ్యాక్ ని కెలికి మరీ గొడవను పెద్దది చేశారట. ఒక దశలో పవన్ చిరంజీవి పోస్టర్లను సైతం చింపేసి రచ్చ చేయడంతో వ్యవహారం కాస్తా పోలీసుల దాకా వెళ్ళి కేసీ చేకూర్ని అరెస్ట్ చేశారని అంటున్నారు.
ఇక అటూ ఇటూ ఫ్యాన్స్ మధ్య వివాదం పెద్ద ఎత్తున చెలరేగడంతో ఈవెంట్ మేనేజర్లు కార్ల్టన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో డల్లాస్ పోలీసులు కేసీ చేకూరిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే తానా రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రస్తుతం రెండు వైపుల ఉన్న ఫ్యాన్స్ ని నచ్చచెప్పి చేకూరికి బెయిల్ ఇప్పించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు.