Sri Chaitanya | BS Rao
విధాత: శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ డా.బి.ఎస్. రావు కన్నుమూశారు. ప్రమాదవశాత్తు బాత్రూమ్ లో జారిపడటంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ బి.ఎస్. రావును అపోలో ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ గురువారం మధ్యాహ్నం తుది శ్వాసం విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని విజయవాడకు తరలించనున్నారు.
డాక్టర్ బీఎస్ రావు పూర్తి పేరు బొప్పన సత్యనారాయణరావు. 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను ప్రారంభించి, అనతి కాలంలోనే ఆ సంస్థలను అగ్రగామి పథంలో నడిపించారు. మొదట విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలతో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది.
ఆపై అంచెలంచెలుగా ఎదిగి, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్కు కేరాఫ్ అడ్రెస్ గా శ్రీచైతన్యను ఉన్నత స్థానానికి చేర్చారు. డాక్టర్ బీఎస్ రావు 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లు స్థాపించారు. బిఎస్ రావు అకాల మృతితో ఆయన కుటుంబంతో పాటు శ్రీ చైతన్య విద్యాసంస్థల వర్గాల్లో విషాధం అలుముకుంది.